
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్లో మరో కొత్త కుర్రాడు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. ఆడుతున్నది తొలి ఐపీఎల్ టోర్నమెంటే అయిన్పప్పటికీ.. మెచ్యూరిటీ బ్యాటింగ్ను కనపర్చాడు. ఒకవంక వరుసగా వికెట్లు పడిపోతున్నప్పటికీ.. మరో ఎండ్లో క్రీజ్లో పాతుకుని పోయి, భారీ స్కోరును.. భారీ షాట్లను ఆడటం మాటలు కాదు. అయినప్పటికీ- అంత ఒత్తిడిలోనూ రాణించగలిగాడు. జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ కొత్త కుర్రాడు చేసిన స్కోరే జమ కాకపోయి ఉంటే.. ఆ జట్టు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండేది.
అతనే- షారుఖ్ ఖాన్. పంజాబ్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్. ముంబై వాంఖెడె స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తరఫున టాప్ స్కోరర్. 19 పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయి.. ఏ మాత్రం కోలుకోలేని దశలో క్రీజ్లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ భారీ స్కోర్ సాధించాడు. 36 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 47 పరుగులు చేశాడు. అనుభవజ్ఞులైన బౌలర్లను సైతం అలవోకగా ఆడిపడేశాడు. మూడు పరుగుల తేడాతో తొలి అర్ధసెంచరీని మిస్ చేసుకున్నాడు. మిడిలార్డర్లో షారుఖ్ ఖాన్ నిలదొక్కుకోకపోయి ఉంటే పంజాబ్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారై ఉండేది. వందలోపే చాప చుట్టేసేది.
అతని బ్యాటింగ్ శైలి..నిలదొక్కుకున్న తీరు.. ఒత్తిడిలోనూ అతను ఆడినభారీ షాట్లు.. పంజాబ్ కింగ్స్ కో ఫ్రాంఛైజీ ప్రీతిజింతాను కట్టి పడేశాయి. అతణ్ని ప్రశంసించకుండా ఉండలేకపోయిందామె. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఓ కొత్త స్టార్ ఆవిర్భవించాడంటూ ప్రీతిజింతా వ్యాఖ్యానించారు. ఈ రాత్రి తమది కానప్పటికీ.. జట్టులో కొన్ని పాజిటివ్ సంకేతాలు కనిపించాయని ఆమె కామెంట్స్ చేశారు. అత్యంత ప్రతికూల, ఒత్తిడిపూరక వాతావరణంలో షారుఖ్ ఖాన్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని అన్నారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్తో పోల్చుకుంటే.. ఈ మ్యాచ్లో బౌలర్లు రాణించడం సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 106 పరుగులే చేయగలిగింది. ఇందులో షారుఖ్ ఖాన్ చేసినవే 47. లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ.. దాన్ని అందుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు శ్రమించాల్సి వచ్చింది. లక్ష్యం చేతికి అందేంత దూరంలో ఉన్న సమయంలో వరుసగా వికెట్లను కోల్పోయింది ధోనీ సేన. తేలికపాటి టార్గెట్ను ఛేదించడానికి నాలుగు వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లు మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, మురుగన్ అశ్విన్ వికెట్లు పడగొట్టారు. మిగిలిన వారు పొదుపుగా బౌలింగ్ చేశారు.