అహ్మదాబాద్: బ్యాట్స్మెన్ అంతా విఫలమైన వేళ తాత్కలిక కెప్టెన్ మయాంక్ అగర్వాల్(58 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 99 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు పంజాబ్ కింగ్స్ 167 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. మయాంక్కు అండగా అరంగేట్ర ప్లేయర్ డేవిడ్ మలాన్(26) రాణించడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ చెరొక వికెట్ తీశారు. కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మయాంక్ రెండో స్థానంలో నిలిచాడు. అతని కన్నా ముందు సంజూ శాంసన్(119) ఉన్నాడు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సంజూ ఈ ఘనతను అందుకున్నాడు.
ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(12) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. రబడా బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(13) సిక్స్, ఫోర్తో జోరు చూపించినా రబడా వైవిధ్యమైన ఫుల్ టాస్కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పంజాబ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 39 రన్స్ చేసింది. అనంతరం డేవిడ్ మలాన్తో కలిసి మయాంక్ ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరూ నిదానంగా ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసాడు. మలాన్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో మూడో వికెట్కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా(1).. మయాంక్తో సమన్వయ లోపంతో రనౌట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన షారుఖ్ ఖాన్(4)తో కలిసి మయాంక్ ధాటిగా ఆడాడు. ఎక్కువ స్ట్రైక్ తీసుకుంటూ భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షారుఖ్ను అవేశ్ ఖాన్ ఔట్ చేయగా.. క్రిస్ జోర్డాన్(2)ను రబడా పెవిలియన్ చేర్చాడు. చివర్లో హర్ప్రీత్తో కలిసి భారీ షాట్లు ఆడిన మయాంక్.. ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్తో సరిగ్గా 99 పరుగులతో అజేయంగా నిలిచాడు.