అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో టేబుల్ టాపర్గా నిలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కలిక కెప్టెన్ మయాంక్ అగర్వాల్(58 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 99 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగగా.. అరంగేట్ర ప్లేయర్ డేవిడ్ మలాన్(26) పర్వాలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ చెరొక వికెట్ తీశారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 167 రన్స్ చేసి 14 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. శిఖర్ ధావన్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా పృథ్వీ షా(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 39), షిమ్రాన్ హెట్మైర్(4 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 16 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో రిలే మెరిడిత్, క్రిస్ జోర్డాన్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ తీశారు.
ఇక 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్కు 63 పరుగులు జోడించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఈ క్రమంలోనే పృథ్వీ ధాటిగా ఆడుతూ హర్ప్రీత్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి బౌల్డయ్యాడు. ఆపై ధావన్, స్టీవ్స్మిత్(24 ) నిలకడగా ఆడి రెండో వికెట్కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించారు.
అయితే, మెరిడిత్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి స్మిత్ భారీ షాట్ ఆడబోయి మలన్ చేతికి చిక్కాడు. దాంతో ఢిల్లీ 111 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం పంత్(14), ధావన్ మరింత ధాటిగా ఆడారు. అయితే జట్టు విజయానికి 20 పరుగుల దూరంలో ఉండగా పంత్ ఔటయ్యాడు. చివర్లో షిమ్రన్ హెట్మైయర్ దంచికొట్టడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది.