సిడ్నీ: భారత్లో కరోనా వైరస్ ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. లక్షల సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మరోసారి మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా బారిన పడి మరణించిన పేషెంట్ల సంఖ్యలోనూ అదే తీవ్రత ఉంది. కొత్తగా మృత్యువాత పడిన వారి సంఖ్య 2,700లకు పైమాటే. ఆక్సిజన్ అందక వేలాదిమంది పేషెంట్లు అల్లాడుతున్నారు. మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించడానికి శ్మశానాల ముందు బారులు తీరి నిల్చోవాల్సిన దుస్థితి చాలాచోట్ల నెలకొంది. ఈ పరిస్థితులన్నింటినీ ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
భారత్ను ఆదుకోవడానికి ముందుకొస్తున్నాయి. అదే సమయంలో-ముందు జాగ్రత్త చర్యలను కూడా తీసుకుంటున్నాయి. బ్రిటన్ ఇప్పటికే భారత్ను రెడ్లిస్ట్లో ఉంచింది. హాంకాంగ్, సింగపూర్ వంటి చాలా దేశాలు భారత విమానాలను నిషేధించాయి. ట్రావెల్ బ్యాన్ చేశాయి. తాజాగా- ఆస్ట్రేలియా కూడా ఆ జాబితాలో చేరింది. భారత్కు రాకపోకలు సాగించే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం వచ్చేనెల 15వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఈ ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు.
మరోవంక- ఆస్ట్రేలియాకే చెందిన పలువురు క్రికెటర్లు.. భారత్లో ఐపీఎల్ టోర్నమెంట్ ఆడుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వేల్, డేనియల్ క్రిస్టియన్, క్రిస్ లీన్, ఢిల్లీ కేపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, టామ్ మూడీ, వంటి పలువురు ప్లేయర్లు ఐపీఎల్ 2021లో వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఆస్ట్రేలియా ట్రావెల్ బ్యాన్ విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో వారందరూ స్వదేశానికి తిరిగి వెళ్తారంటూ మొదట వార్తలొచ్చినప్పటికీ.. క్రికెట్ ఆస్ట్రేలియా వాటిని కొట్టివేసింది. టోర్నమెంట్ ముగిసే వరకూ భారత్లోనే ఉంటారని తెలిపింది.
వచ్చేనెల 30వ తేదీన ఐపీఎల్ టోర్నమెంట్ ముగుస్తుంది. అప్పటివరకూ వారంతా భారత్లోనే ఉంటారని స్పష్టం చేసింది. టోర్నమెంట్ ముగిసే సమయానికి కూడా భారత్-ఆస్ట్రేలియాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరణకు నోచుకోకపోతే తాము ప్రత్యామ్నాయాన్ని చూస్తామని తెలిపింది. క్రికెటర్లను తరలించడానికి ప్రత్యేకంగా ఛార్టర్ ఫ్లైట్ను ఏర్పాటు చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. అంతకుుందు- ముంబై ఇండియన్స్ ఓపెనర్, ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ లీన్ ఇదే విజ్ఞప్తి చేశారు. ట్రావెల్ బ్యాన్ అమల్లోకి వచ్చినందున స్వదేశానికి సురక్షితంగా చేరుకోవడానికి ఛార్టర్ ఫ్లైట్ను ఏర్పాటు చేయాలని లీన్ కోరాడు.