
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో తొలి అర్ధభాగం అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఈ సందర్భంగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విటర్ వేదికగా ఓ భావోద్వేగ సందేశం ఇచ్చాడు. ఐపీఎల్ 2020లో జట్టు సభ్యులమంతా ఒడిదుడుకులను తట్టుకుని మెరుగైన ప్రదర్శన చేశామని పేర్కొన్నాడు. జట్టుగా తమకు ఇది గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సామాజిక మాధ్యమాల్లో స్పందించాడు. జట్టు బృందంతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యాడు. 'ఒడుదొడుకుల సమయాల్లో జట్టు సమష్టిగా ఉంది. ఒక బృందంగా ఈ ప్రయాణం చాలా గొప్పగా ఉంది. ఇక పరిస్థితులు మాకు అనుకూలంగా మారలేదనేది నిజమే అయినా మా ఆటగాళ్ల పట్ల గర్వంగా ఉంది. ఎప్పటిలాగే మాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2020లో తొలి పది మ్యాచ్ల్లో ఏడు విజయాలు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. చివరి ఐదు మ్యాచ్ల్లో ఓడింది. సన్రైజర్స్ హైదరాబాద్తోనే రెండు సార్లు ఓడింది. కీలక సమయంలో చతికలపడి భారీ మూల్యం చెల్లించుకుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కోహ్లీసేన కప్పు కల నెరవేరకుండానే నిష్క్రమించింది. దీంతో ఆ జట్టు ఓటమిపై అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు ఈ లీగ్లో విజేతగా నిలవలేదని మండిపడుతున్నారు.
ఇక మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'స్కోరు బోర్డుపై మేం సరైన పరుగులు చేయలేదు. కేన్ విలియమ్సన్ హైదరాబాద్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేసింది. దాంతో సరైన పరుగులు చేయలేకపోయాం. అయితే, బ్యాటింగ్లో ఇంకాస్త దూకుడుగా ఆడాల్సింది. వార్నర్ టీమ్పై ఆధిపత్యం చెలాయించడానికి మాకు ఏ సందర్భంలోనూ అవకాశం రాలేదు. ఇక మా బౌలింగ్లోనూ వాళ్లపై ఒత్తిడి తీసుకురాలేకపోయాం' అని చెప్పాడు.
'గత నాలుగైదు మ్యాచ్ల్లో పరిస్థితులు మరోలా మారాయి. అయితే పలువురు ఆటగాళ్లు బాగా ఆడారు. అందులో దేవ్దత్ పడిక్కల్ ఒకరు. అతడు ఈ సీజన్లో అద్భుతంగా రాణించాడు. 400కి పైగా పరుగులు చేశాడు. తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది. ఇక మొహమ్మద్ సిరాజ్ గాడిలో పడడంతో పాటు యుజ్వేంద్ర చహల్, ఏబీ డివిలియర్స్ ఎప్పటిలాగే మెరిశారు. ఇతరులు కూడా కష్టపడినా అది సరిపోలేదు. మాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు' అని బెంగళూరు కెప్టెన్ చెప్పుకొచ్చాడు.