
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి ప్రత్యేకత చాటనుంది. ప్రతి ఏటా జరిగే ఐపీఎల్లో రెగ్యులర్గా వేసుకునే జెర్సీ కంటే ఏదో ఒక మ్యాచ్కు మరో కలర్ జెర్సీ వేసుకోవడం అందుకు గల కారణం కూడా వివరించడం చేస్తోంది విరాట్ ఆర్మీ. ఈ సారి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక మంచి ఇనిషియేటివ్ను ప్రమోట్ చేస్తూ అందులో భాగంగా జెర్సీ కలర్ను మారుస్తుంది. ఈ సారి కూడా విరాట్ కోహ్లీ ఆర్మీ గ్రీన్ కలర్ జెర్సీని ఆదివారం సాయంత్రం జరిగే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్తో ధరించనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరగనున్న మ్యాచ్కు రెగ్యులర్ రెడ్ కలర్ జెర్సీ కాకుండా గ్రీన్ కలర్ జెర్సీని ధరించనుంది. ప్రపంచం కాలుష్యం బారిన పడి వాతావరణం హానికరంగా మారుతున్న నేపథ్యంలో చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందాం అని సింబాలిక్గా చెప్పేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ గ్రీన్ కలర్ జెర్సీని ధరించనుంది. ఈ మేరకు ఆర్సీబీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ పై ఓ వీడియోను పోస్టు చేసింది. ఏబీ డెవిలియర్స్ మెసేజ్తో ప్రారంభమయ్యే ఈ వీడియో కెప్టెన్ విరాట్ కోహ్లీ మెసేజ్తో ముగుస్తుంది. లెట్స్ గో గ్రీన్ పేరుతో ఈ ఇనిషియేటివ్ను ఆర్సీబీ ప్రమోట్ చేస్తోంది.
పర్యావరణం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం తమవంతు కృషి చేయాలని ఏబీ డెవీలియర్స్ చెప్పాడు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ పడేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నాడు. అంతేకాదు తన పిల్లలకు కూడా పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పిన ఏబీ డెవీలియర్స్... చిన్న చిన్న విషయాలను క్రమం తప్పకుండా బాధ్యతతో చేస్తే ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకున్నవారమవుతామని మెసేజ్ ఇచ్చాడు. ఇక మరో ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్, ఆరోన్ ఫించ్ కూడా పర్యావరణంపై మాట్లాడుతూ... భూమిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనంతో నింపాలని చెట్లను నాటాలని పిలుపునిచ్చారు.
2011 నుంచి ఆర్సీబీ గో గ్రీన్ కార్యక్రమం చేపడుతోందని చెప్పాడు విరాట్ కోహ్లీ. పర్యావరణం కాపాడుకుంటేనే అందరం బాగుంటామని చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణంను కాపాడుకుందామని విరాట్ పిలుపునిచ్చాడు.