దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం మరో ఆసక్తికర సమరంకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోహ్లీ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు పంజాబ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ 2020లో ఇప్పటి వరకూ బరిలో దిగని క్రిస్ గేల్.. ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు. దీపక్ హుడా, మురుగన్ అశ్విన్ జట్టులోకి వచ్చారు.
ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పంజాబ్.. వరుస విజయాలతో జోరుమీదున్న బెంగళూరుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. బెంగళూరుతో జరిగే మ్యాచ్లో పంజాబ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్లో ఓడితే ప్లేఆఫ్స్ బెర్తు అవకాశాలను కోల్పోతుంది. పంజాబ్ సీజన్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడగా ఆరు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక పాయింట్ల పట్టికలో బెంగళూరు (5 గెలుపు, 2 ఓటమి) మూడో స్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 25 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో పంజాబ్ 13 మ్యాచుల్లో విజయం సాధించింది. బెంగళూరు 12 విజయాలు నమోదు చేసింది. ఈ మ్యాచులో గెలిచి లెక్కసరిచేయాలని కోహ్లీసేన చూస్తోంది. మరోవైపు విజయం సాధించి లీడ్ కొనసాగించాలని పంజాబ్ భావిస్తోంది. ఈ సీజన్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ 97 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
ధోనీ సాయం మరువలేనిది.. ఈ స్థాయిలో ఉండటానికి కారణం మహీనే: ఆర్సీబీ స్పిన్నర్