అలా అయితే కష్టమే:
ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఐపీఎల్లో రాణించడం ఎంఎస్ ధోనీకి కష్టమేనని కపిల్ దేవ్ అన్నారు. దేశవాళీ క్రికెట్ ఆడితేనే మహీ దేహం తన మాట వింటుందన్నారు. కపిల్ తాజాగా మీడియాతో మాట్లాడారు. 'కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడాలని ధోనీ నిర్ణయించుకుంటే.. అతడు రాణించడం చాలా కష్టం. వయసు గురించి మాట్లాడటం సరికాదు. కానీ ఈ వయసులో ఎంత ఎక్కువగా ఆడితే అంతగా తన శరీరం సహకరిస్తుంది' అని కపిల్ దేవ్ పేర్కొన్నారు. ధోనీ ప్రస్తుత వయసు 39. గత ఆగస్ట్ 15న మహీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడతానంటే కుదరదు:
'ఏడాదిలో పది నెలలు క్రికెట్ ఆడకుండా.. హఠాత్తుగా రెండు నెలలు ఐపీఎల్ ఆడితే ఏం జరుగుతుందో మీరు చూశారు. ఎక్కువ క్రికెట్ ఆడితేనే ఒక్కోసారి రాణించడం కష్టంగా ఉంటుంది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్కు ఏం జరిగిందో మీకు తెలుసు. అందుకే ఎంఎస్ ధోనీ ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాలి. ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడతానంటే మాత్రం కష్టం' అని టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ అన్నారు. 2019లో వన్డే ప్రపంచకప్ ఆడిన తర్వాత ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా మహీ ఐపీఎల్ 2020 ఆడాడు. 14 మ్యాచుల్లో కేవలం 200 పరుగులే చేశాడు. ఒక్క అర్ధ శతకం లేదు. స్ట్రైక్రేట్ 116.
బ్యాటింగ్లో మెరవాలంటే:
ఐపీఎల్ 2021 ఎంఎస్ ధోనీ ఆడటం తనకు కూడా సంతోషమని, వచ్చే సీజన్లో మహీ బ్యాటింగ్లో మెరవాలంటే నెట్స్లో సాధన ఒక్కటే సరిపోదని దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. 'ధోనీ కచ్చితంగా ఆడాలి. అయితే దేశవాళీ క్రికెట్ ఆడాలి. నెట్స్లో సాధన చేస్తే సరిపోతుంది కానీ నిజంగా క్రికెట్ ఆడితేనే బాగుంటుంది. ఎందుకంటే వయసు పైబడే కొద్ది టైమింగ్లో తేడా వస్తుంది. జిమ్కి వెళ్లి ఎంత దృఢంగా మారినా ఆడేటప్పుడు షాట్ల టైమింగ్లో తేడా ఉంటుంది. ఇప్పుడు ధోనీ కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. అతడు దేశవాళీ క్రికెట్ ఆడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. దాంతో మనం చేసేదేం లేదు. అతడు క్రికెట్ ఆడితేనే బాగుంటుంది. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి ఉండదు. మ్యాచ్లు ఆడితేనే ఒత్తిడిని తట్టుకొని రాణిస్తాడు' అని చెప్పుకొచ్చారు.