
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కేప్టెన్ కపిల్ దేవ్ అభిమానుల ముందుకు వచ్చారు. అయిదు రోజుల కిందట గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన ఆయన ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. దేశ రాజధానిలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందారు. ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారు డాక్టర్లు. డిశ్చార్జ్ తరువాత తొలిసారిగా కపిల్ దేవ్ అభిమానులను పలకరించారు. ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు.
తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని కపిల్ దేవ్ చెప్పారు. గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన తాను కోలుకోవాలంటూ ప్రార్థించిన అభిమానులు, క్రికెటర్లకు కృతజ్ఙతలు తెలిపారు. భారత్కు తొలిసారిగా ప్రపంచకప్ను సాధించి పెట్టిన 1983 జట్టును కలుసుకోవాలని ఉందని చెప్పారు. త్వరలోనే 1983-వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యామిలీని కలుస్తానని అన్నారు. 1983 వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యామిలీని వీలైనంత త్వరగా కలుస్తానని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరికొచ్చేసిందని, వచ్చే ఏడాది ప్రారంభం అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కపిల్ దేవ్ తెలిపారు.
కపిల్ దేవ్.. గండెపోటుకు గురి కావడం, ఆసుపత్రిలో చేరిన పరిణామాలు భారత క్రీడా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసింది. న్యూఢిల్లీ తన నివాసంలో ఉన్న సమయంలో ఆయన స్వల్పంగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు తరలించారు. అక్కడ ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఫోర్టిస్ ఆసుప్రతి కార్డియాక్ విభాగం డాక్టర్ మాథుర్ సారథ్యంలోని వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందించింది. ఎమర్జెన్సీ కొరొనరీ యాంజియోప్లాస్టీ చేశారు.
కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కేప్టెన్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ కేపిటల్స్ మెంటార్, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, కోల్కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ షారుక్ ఖాన్, కేకేఆర్ మాజీ కేప్టెన్, భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ అకాంక్షించారు. మూడు రోజుల కిందట కపిల్ దేవ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంటికి చేరుకున్నారు. విశ్రాంతి తీసుకున్నారు. ఆరోగ్యం పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ మధ్యాహ్నం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తాను క్షేమంగా ఉన్నానని, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.