దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్లో సూపర్ బౌలింగ్తో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ 13 ఏళ్ల క్యాష్ లీగ్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా గుర్తింపు పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన క్వాలిఫయర్ 1లో మ్యాచ్లో ముంబై 57 పరుగులతో గెలుపొంది ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 4-1-14-4తో కెరీర్ బెస్ట్ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బుమ్రా.. ఢిల్లీ పతనాన్ని శాసించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.
శిఖర్ ధావన్ (0), శ్రేయస్ అయ్యర్ (12), మార్కస్ స్టోయినిస్ (65), డేనియల్ సామ్స్ (0) కీలక నాలుగు వికెట్లు తీయడంతో ఈ సీజన్లో బుమ్రా వికెట్ల సంఖ్య 27కు చేరంది. దాంతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కగిసో రబాడ(23)ను వెనక్కు నెట్టి బుమ్రా పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా ఇప్పటి వరకూ భువనేశ్వర్ కుమార్ (26) పేరిట ఉండగా.. తాజా ప్రదర్శనతో బుమ్రా ఆ రికార్డును అధిగమించాడు. 2017 సీజన్లో సన్రైజర్స్ తరఫున 26 వికెట్లు తీసిన భువీ.. ఆ ఏడాది పర్పుల్ క్యాప్ సాధించాడు. ఐపీఎల్లో ఓ సీజన్లో ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డ్ లసిత్ మలింగ పేరిట ఉంది. 2011 సీజన్లో మలింగ 28 వికెట్లు తీశాడు. మరో వికెట్ తీస్తే బుమ్రా ఈ రికార్డును సమం చేస్తాడు. ఇక ఐపీఎల్లో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013లో బ్రావో 32 వికెట్లు తీసాడు. ఆ తర్వాత జేమ్స్ ఫాల్కనర్ (28), లసిత్ మలింగా ఉన్నారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) సూర్య కుమార్ యాదవ్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. వీరి ప్రతాపానికి అశ్విన్ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది.
MI vs DC: అంబానీ అత్త వచ్చింది.. ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచింది!