మినీ ఐపీఎల్ చర్చ:
ఐపీఎల్-13 సీజన్ మార్చి 29న ప్రారంభంకావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15 వరకు లీగ్ను వాయిదా వేశారు. ఆపై వారం కింద బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజ్ యజమానుల సమావేశం జరగగా.. అందులో మినీ ఐపీఎల్ చర్చకు వచ్చింది. అయితే ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఇక రోజురోజుకు దేశంలో కరోనా తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. దీంతో ఐపీఎల్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజ్ యజమానులతో ఈ రోజు కాన్ఫరెన్స్ కాల్ సమావేశంను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. తదుపరి కార్యాచరణపై టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలతో మాట్లాడాలని నిర్ణయించింది.
కాన్ఫరెన్స్ సమావేశం వాయిదా:
బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజ్ యజమానులతో షెడ్యూల్ ప్రకారం ఈ రోజు జరగాల్సిన కాన్ఫరెన్స్ కాల్ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ కంటే కొన్ని నిమిషాల ముందు వీడియో కాన్ఫరెన్స్ని రద్దు చేస్తున్నట్లు ఫ్రాంఛైజీలకి బీసీసీఐ సమాచారం అందించింది. దీంతో ఇక ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాదంటూ ఓ ఫ్రాంఛైజీ అధికారి తెలిపారు. 'ఇలాంటి సమయంలో ఏదైనా చర్చించడంలో అర్థం లేదు. దేశం మొత్తం లాక్ డౌన్లో ఉంది. ఐపీఎల్ కంటే చాలా ముఖ్యమైన విషయాలను మేము పరిష్కరించుకోవాలి' అని మరో ఫ్రాంచైజ్ యజమాని అన్నారు
ఐపీఎల్ గురించి మాట్లాడటంలో అర్థం లేదు:
'మాకు మానవత్వం ముఖ్యం. మిగతావన్నీ తర్వాత. మన దగ్గర పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడటంలో అర్థం లేదు. అందుకే నేను ఈ సమయంలో ఐపీఎల్ గురించి కూడా ఆలోచించలేను. ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది. వారు తీసుకున్న చురుకైన చర్యలకు వారిని మెచ్చుకోవాలి. భారతదేశం అన్ని విమానాలను నిలిపివేసింది' అని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా చెప్పారు.
మరో ప్రత్యామ్నాయం బీసీసీఐకి లేదు:
భారత్లో మంగళవారం నాటికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 523కి చేరుకోగా.. ఇప్పటికే 10 మంది మరణించారు. ఐపీఎల్ మ్యాచ్లు జరిగే ప్రధాన రాష్ట్రాల్లోనే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఏప్రిల్ రెండో వారానికి దేశంలో పరిస్థితులు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు పర్యాటక వీసాల్ని ఏప్రిల్ 15 వరకూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వీటన్నింటిని చూస్తే.. ఐపీఎల్ని రద్దు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం బీసీసీఐకి లేదు.