పంత్ ఒక్కడే నిలిచాడు:
రాజస్థాన్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ బరిలోకి దిగగా.. ఆ జట్టుకు ఆరంభంలో షాక్ తగిలింది. ఓపెనర్లు పృథ్వీషా (8), శిఖర్ధావన్ (16) నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (15), రిషభ్ పంత్ (53; 38 బంతుల్లో 2x4, 5x6) ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. ధాటిగా ఆడే క్రమంలో శ్రేయస్ ఔటైనా.. పంత్ పరుగులు చేసాడు. అయితే కొలిన్ ఇంగ్రామ్ (12), రూథర్ఫోర్డ్ (11)తో కలిసి పంత్ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అక్షర్ తో కలిసి చివరలో అర్ధ శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో ఇష్ సోధి మూడు వికెట్లు తీసాడు.
ఆరంభంలోనే షాక్:
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రాజస్థాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. పేసర్ ఇశాంత్ శర్మ వేసిన 2వ ఓవర్ చివరి బంతికి ఓపెనర్ రహానే (2) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇశాంత్ వేసిన 4వ ఓవర్ ఐదో బంతికి లివింగ్స్టోన్ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక అక్షర్ వేసిన ఐదో ఓవర్లో సంజూ శాంసన్ (5) రనౌట్ అయ్యాడు. దీంతో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్.
ఆదుకున్న పరాగ్:
ఇశాంత్ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టిన లామ్రోర్.. ఆ తర్వాతి బంతికి పెవిలియన్ చేరాడు. అమిత్ మిశ్రా వేసిన 12వ ఓవర్లో శ్రేయస్ గోపాల్ (12), స్టుపర్ట్ బిన్ని (0) వరుస బంతుల్లో అవుట్ అయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో అర్ధ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే ఇన్నింగ్స్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడి రూథర్ఫోర్డ్ చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్ ఇన్నింగ్స్కి తెరపడింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా మూడేసి వికెట్లు పడగొట్టాడు.