

హైదరాబాద్: మార్చి 23 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ కోసం ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ టీమిండియా క్రికెటర్లతో ఆసక్తి కరమైన ప్రొమోలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోలను తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంటూ వచ్చే సీజన్పై అంచనాలపై పెంచుతుంది.
ఇప్పటికే విడుదల చేసిన కొన్ని ప్రోమోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నీ కెప్టెన్పైనే స్లెడ్జింగ్కు దిగుతావా? అంటూ బుమ్రాని కోహ్లీ హెచ్చరించడం... గురువు అంటూనే నా సంగతి చూస్తా అంటావా? అంటూ రిషబ్ పంత్ను ధోని సున్నితంగా మందలిస్తున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రోమోలను చిత్రీకరించింది.
ఈ ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టార్స్ స్పోర్ట్స్ తన ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోలో ముంబై బౌలర్ బుమ్రా.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసురుతాడు. స్టేడియంలో వరల్డ్ బెస్ట్ బౌలర్ అనే పోస్టర్ని చూసిన బుమ్రా "ఇంకా కాదు, వరల్డ్లో బెస్ట్ బ్యాట్స్ మెన్ వికెట్ను ఇంకా తీయలేదు. చీకూ భాయ్(కోహ్లీ), నేను వస్తున్నా, ఈసారి నువ్వు మా టీమ్లో లేవు" అని బుమ్రా అంటాడు.
బుమ్రా వ్యాఖ్యలపై కోహ్లీ "నీ కెప్టెన్నే స్లెడ్జ్ చేస్తావా?" అని అంటాడు. ఆ తర్వాత ప్లేట్లో సలాడ్ని ఫోర్క్తో తీసుకున్న కోహ్లీ నవ్వుతూ "బాగుంది, ఎట్టకేలకు స్లెడ్జింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నావ్?" అని అంటాడు. అలాగే, రిషబ్ పంత్ని ఉద్దేశించి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై వచ్చిన ప్రోమో బాగుంది.