
హైదరాబాద్: గత రెండు రోజులుగా ఐపీఎల్లో మన్కడింగ్ ఔట్ అనే పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం జైపూర్ వేదికగా సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అశ్విన్... జోస్ బట్లర్ని మన్కడింగ్ విధానంలో ఔట్ చేయడమే. అయితే, ఈ మన్కడింగ్ రనౌట్ని ఉపయోగించుకుని కోల్కతా పోలీసులు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. ఇదే అదనుగా బౌలింగ్ని నిలిపివేసిన అశ్విన్ వెనక్కి వచ్చి బెయిల్స్ పడగొట్టి అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది.
కానీ.. అశ్విన్ అనైతికతంగా వ్యవహరించాడని కాసేపు మైదానంలో గొడవచేసిన బట్లర్.. తిట్టుకుంటూనే పెవిలియన్కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. ప్రస్తుతం భారత్లో ఐపీఎల్ హవా నడుస్తుండటంతో కోల్కతా పోలీసులు తెలివిగా ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించడం దీనిని వాడారు.
ట్రాఫిక్ సిగ్నల్ లైన్ దాటిన ఓ వాహనం ఫొటోను దాని పక్కనే క్రీజు దాటిన జోస్ బట్లర్ మన్కడింగ్ ద్వారా రనౌట్ అయిన ఫొటోను పెట్టి ట్వీట్ చేశారు. దీనికి క్యాప్షన్గా "క్రీజ్ అయినా.. రోడ్డు అయినా.. లైన్ దాటితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే" అని ట్వీట్ చేసింది.
కాగా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా క్రీజు దాటి నోబాల్ విసరగా.. లైఫ్ అందుకున్న ఫకార్ జమాన్ సెంచరీతో పాకిస్థాన్ను గెలిపించాడు. దీనిని అప్పట్లో జైపూర్ ట్రాఫిక్ పోలీసులు బుమ్రా.. నోబాల్ ఫొటోతో ఏకంగా రోడ్డుపై బ్యానర్లే కట్టారు. దీనిపై బుమ్రా మండిపడటంతో ఆ తర్వాత జైపూర్ పోలీసులు అతడికి సారీ చెప్పిన సంగతి తెలిసిందే.