ఆరంభం నిరాశపరిచింది:
మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... 'మేము అనుకున్నంన్ని పరుగులు చేయలేకపోయాం. ఇన్నింగ్స్ ఆరంభం నిరాశపరిచింది. ముఖ్యంగా పవర్ప్లేలో మంచి ఆరంభం లభించలేదు. చెన్నై జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు.. వాళ్ల బౌలింగ్లో పరుగులు చేయడం చాలా కష్టం. ఈ పిచ్ మాకు సహకరిస్తుందని అనుకున్నాం. ఇక్కడ గతంలోనూ ఒక మ్యాచ్ ఆడాం. అయితే మా జట్టులో ఏ ఒక్కరూ బాధ్యతగా ఆడలేదు. భాగస్వామ్యాలు కూడా నెలకొల్పడంలో విఫలమయ్యాం' అని శ్రేయస్ తెలిపారు.
వారి పక్కన నిలబడటం అదృష్టం:
'ఈ సీజన్ నుంచి ఎంతో నేర్చుకున్నాం. సొంత పిచ్ అయిన కోట్లా కూడా మాకు అంతగా సహకరించలేదు. ఆ పిచ్పై చాలా ప్రాక్టీస్ అవసరం. మేము ప్రొఫషనల్ క్రికెటర్లం కాబట్టి పిచ్ను నిందించలేం. టాస్ వేసే సమయాల్లో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పక్కన నిలబడటం అదృష్టంగా భావిస్తున్నా. వారు జట్లను నడిపించిన తీరు బాగుంది. వారిని చూసి కెప్టెన్గా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను' అని శ్రేయస్ చెప్పుకొచ్చారు.
ఇది ఆరంభం మాత్రమే:
'జట్టు యాజమాన్యం కెప్టెన్గా నాకు అవకాశం ఇచ్చింది. గౌరవం, మద్దతు విషయంలో రాజీపడలేదు. దిల్లీ జట్టుతో ప్రయాణం బాగుంది. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడి వరకూ రావడానికి చాలా కష్టపడ్డాం. జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉంది. ఈ సీజన్ మాకు ఎంతో ప్రత్యేకమైంది. ఇది ఆరంభం మాత్రమే.. మున్ముందు మరింత రాణిస్తాం' అని శ్రేయస్ పేర్కొన్నారు.
చెన్నై చెమక్:
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (25 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా.. కొలిన్ మున్రో (24 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో, జడేజా, హర్భజన్, దీపక్ చహర్ తలా రెండు వికెట్లు తీశారు. ఛేదనలో చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షేన్ వాట్సన్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు.