|
తొలి మ్యాచ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని
ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్న తొలి మ్యాచ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. ధోనీ చేతుల మీదుగా చెక్ను అందిచనున్నట్లు సీఎస్కే డైరెక్టర్ రాకేశ్ సింగ్ తెలిపారు.
మార్చి 23న సీఎస్కే vs ఆర్సీబీ తొలి మ్యాచ్
మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్తో ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ టికెట్లను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన మొదటి రోజే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.
పంజాబ్ విరాళం రూ. 25 లక్షలు
పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లలో పంజాబ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు జవాన్లు ఉన్నారు. ఈ ఐదు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 25 లక్షలను విరాళంగా అందజేసింది. ఈ చెక్కులను ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు జైమాల్ సింగ్, సుఖిజిందర్ సింగ్, మహిందర్ సింగ్, కుల్విందర్ సింగ్, తిలక్ రాజుల కుటుంబాలకు పంజాబ్ కెప్టెన్ అశ్విన్, సీఆర్పీఎఫ్ డీఐజీ వీకే కౌందాల్లు అందజేశారు.
బీసీసీఐ విరాళం రూ. 20 కోట్లు
బీసీసీఐ రూ. 20 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసి దానికయ్యే ఖర్చును సైన్యానికి ఇవ్వాలని అంతకముందే బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్ ప్రారంభోత్సవ బడ్జెట్ సుమారు రూ. 15 కోట్లు. దానికి మరో రూ. 5 కోట్లు కలిపి ఇవ్వాలని బీసీసీఐ ప్రతిపాదించింది. మార్చి 23న జరిగే ఐపీఎల్-12 ప్రారంభోత్సవానికి త్రివి ధ (ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ) దళాలలోని అత్యున్నత స్థాయి అధికారులను ఆహ్వానించి.. వారికి ఈ విరాళాన్ని అందజేయనుంది. సైనిక సంక్షేమ నిధికి రూ. 20 కోట్లు ఇచ్చేందుకు సీవోఏ అనుమతించింది.