హైదరాబాద్: లీగ్ పట్టికలో చివర్లో నిలుచున్న బెంగళూరు, ముంబై జట్ల మధ్య సమరం మంగళవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. అయితే లీగ్ మొత్తంలో ఏ మాత్రం మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయిన ఇరు జట్లు చాలా కష్టంగా మ్యాచ్లో ఆడనున్నాయి. ఎలా అంటే ఇకనుంచి ప్రతి మ్యాచ్ సెమీస్కు వెళ్లినట్లుగానే.
ఐపీఎల్లో ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్ను సెమీఫైనల్ లాగే భావిస్తున్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్. ఎందుకంటే ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉన్నాయి కాబట్టి. టోర్నీలో భాగంగా ఈ రెండు జట్లు మంగళవారం తలపడనున్నాయి. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్. దీంతో ఈ రెండు జట్లు ప్రధాన ఆటగాళ్లతో బరిలో దిగాలని చూస్తున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మిస్టర్ 360, ఏబీ డివిలియర్స్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. జ్వరం కారణంగా డివిలియర్స్ కోల్కతాతో జరిగిన మ్యాచ్కి దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడు ఇంకా జ్వరం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు కనిపించడంలేదని సమాచారం. దీంతో ఈ రోజు ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో ఆడతాడో లేదో అని అనుమానాలు నెలకొన్నాయి.
ఒకవేళ డివిలియర్స్ కోలుకుని తిరిగి జట్టులోకి వస్తే బెంగళూరుకు బలం చేకూరుతుంది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు గతంలో ఒకసారి తలపడగా ముంబై ఇండియన్స్ 46 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందు ముంబై సొంతగడ్డపై ముంబై జట్టును ఎదుర్కొని అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి కోల్కతా పైనా అదే స్థాయి ప్రదర్శన కనబర్చాడు. ఈ బెంగళూరు కెప్టెన్ మళ్లీ చెలరేగుతాడని ముంబై ఆందోళనలో ఉంది. గమనించదగ్గ విషయమేమంటే బెంగళూరుకు మంచి ఫినిషర్ లేడు. ప్రధాన బ్యాట్స్మెన్ అవుటైతే ఆ జట్టు కథ ముగిసినట్లే. మ్యాచ్ ఏ దశలోనూ పదును చూపని బౌలింగ్ విభాగం కోహ్లి పనిని కష్టతరం చేస్తోంది.