
హైదరాబాద్: యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ముందుంటాడు. తాజాగా ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న నితీశ్ రాణా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేశాడు.
ఈ మ్యాచ్లో రాణా ప్రదర్శన చూసిన కోహ్లీ అతన్ని అభినందించాడు. అంతేకాదు ఓ బ్యాట్ను కానుకగా అందజేశాడు. రాణా ఆ బ్యాట్తో ఫొటో దిగి ఇన్స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'మనం ఆడే గేమ్లో గొప్ప క్రీడాకారుడు మనల్ని అభినందిస్తే.. మనం మంచి ప్రదర్శన చేసినట్లే. ఈ బ్యాట్ ఇచ్చిన కోహ్లీకి ధన్యవాదాలు. భయ్యా ఇలాంటి ప్రోత్సాహమే నీ నుంచి కావాలి' అని రాణా పేర్కొన్నాడు.
అరుదైన ఘనతను సాధించిన నితీశ్ రాణా:ఐపీఎల్-11 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ క్రికెటర్ నితీష్ రాణా అరుదైన ఘనత సాధించాడు. వరుస బంతుల్లో ఏకంగా దూకుడు మీద ఉన్న బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లిలను పెవిలియన్కు చేర్చి భారీ స్కోర్కు అడ్డుకట్ట వేశాడు. బ్యాట్స్మన్ అయిన నితీష్ రాణా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా బంతిని అందుకొని రాణించాడు.
ఇలా వరుస బంతుల్లో ఈ స్టార్ బ్యాట్స్మెన్ల వికెట్లు దక్కించుకున్న మూడో బౌలర్గా రికార్డుకెక్కాడు. ఈ స్టార్ బ్యాట్స్మెన్ ఇలా 2012 సీజన్లో జాక్వస్ కల్లీస్ బౌలింగ్లో తొలిసారి అవుటవ్వగా.. తిసారా పెరీరా బౌలింగ్లో 2016లోనూ ఇలానే పెవిలియన్కు చేరారు. తాజాగా నితీష్ బౌలింగ్లో వరుస బంతుల్లో వెనుదిరిగారు.
రంజీ ట్రోఫీలో కోహ్లీ-రాణా ఢిల్లీకే ప్రాతినిధ్యం వహించారు. 2017లో ముంబై ఇండియన్స్కు ఆడిన రాణాను ఈ ఏడాది వేలంలో కోల్కతా దక్కించుకుంది.