
హైదరాబాద్: బ్యాట్స్మెన్ వైఫల్యం కారణంగానే రాయల్ ఛాలెంజర్స్ ఓటమి పాలైందని ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ 'ఇది ఊహించని ఓటమి. మిడిలార్డర్ విఫలమైంది. ఏబీ డివిలియర్స్ సిక్స్లు, ఫోర్లతో పోరాడినప్పటికి అతనికి ఒక్కరు కూడా అండగా నిలవలేకపోయారు. మేం తుది జట్టు విషయంలో ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సింది. కేవలం ఐదు, ఆరుగురు ఆటగాళ్లనే మార్చాం' అని కోహ్లీ అన్నాడు.
'కానీ వారిలో ఒకరిద్దరు మినహా ఎవరు రాణించలేదు. మా బలహీనతలను గుర్తించి వచ్చే సీజన్లో రాణిస్తాం. అన్ని సార్లు ఏబీనే బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టం. అతను స్థిరంగా రాణించాడు. కానీ అతనికి ఎవరు మద్దతు నిలవలేకపోయారు' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
'జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ఉమేశ్, సిరాజ్, చeహల్, మొయిన్ అలీలు తమవంతు కృషిచేశారు. 75/1తో పటిష్ట స్థితిలో ఉన్న మేము విజయం సాధించకపోవడం ఎంతో నిరాశను కలిగించింది' అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక, ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఓ వారం ముందే అక్కడికి వెళ్లి కౌంటీల ఆడనున్నట్లు కోహ్లీ తెలిపాడు.
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
165 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు జట్టు స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ (4/16) ధాటికి 19.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ ఓటమితో కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా, రాజస్థాన్ రాయల్స్ మాత్రం ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.