
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు.
ఈ సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి ఓవర్లో రెండు సిక్స్లు, ఓ ఫోర్ బాదాడు. దీంతో తొలి ఓవర్ వేసిన క్రిస్ వోక్స్ తొలి ఓవర్లో 16 పరుగులు సమర్పించుకున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా దూకుడుగా ఆడటంతో 3 ఓవర్లకు గాను వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది.
ఈ దశలో బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ అద్భుత బౌలింగ్తో మాయ చేశాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్ పంజాబ్ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతోన్న పంజాబ్ను ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో భలేగా దెబ్బకొట్టాడు.
నాలుగో ఓవర్ తొలి బంతికి మయాంక్ అగర్వాల్ను పెవిలియన్ పంపిన ఉమేశ్ (15), రెండో బంతికే అరోన్ ఫించ్ (0)ను ఎల్బీగా పెవిలియన్కు చేర్చాడు. పంజాబ్ డీఆర్ఎస్ కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్రీజులోకి వచ్చిన యువరాజ్ మూడు నాలుగు బంతులను డిఫెన్స్ ఆడి నాలుగో బంతిని బౌండరీ బాదాడు.
ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి స్టార్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ ఒత్తిడిలో పడింది. దీంతో ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు.

ఐపీఎల్లో ఉమేశ్ యాదవ్ మిగతా జట్లపై ఐదుసార్లు ఒకే మ్యాచ్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయగా.. కింగ్స్ ఎలెవెన్పై మాత్రం ఆరుసార్లు మూడు కంటే ఎక్కువ వికెట్లు తీయడం విశేషం.