ఒకవేళ రిటెర్మెంట్ ప్రకటిస్తే:
ఇంగ్లాండ్లో జరుగనున్న 2019వరల్డ్కప్, తర్వాత కొన్ని సిరీస్ల వరకూ ధోనీ అందుబాటులో ఉండొచ్చు. ఆ తర్వాత వయసు రీత్యా ఒకవేళ రిటెర్మెంట్ ప్రకటిస్తే..ధోనీకి ప్రత్యామ్నాయంగా(వికెట్ కీపర్, బ్యాట్స్మెన్)..ఈ ఐపీఎల్ రూపంలో ముగ్గురు యువ ఆటగాళ్లు కనిపిస్తున్నారు.
రిషబ్ పంత్:
ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 20 ఏళ్ల యువ ఆటగాడు అటు బ్యాట్స్మెన్గానూ, ఇటు వికెట్ కీపర్గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఆడిన 12మ్యాచ్లలో ఏకంగా 52.90సగటులతో మొత్తం 582 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. భారీ హిట్టింగ్లతో విరుచుకుపడుతూ..మ్యాచ్ దిశనే మార్చగల సత్తా ఉన్న ఆటగాడిగా పంత్ ఐపీఎల్లో దూసుకుపోతున్నాడు. వికెట్ కీపర్గానూ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు.
సంజూ శాంసన్:
రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్న శాంసన్ ఈ సీజనులో ఆడిన 10మ్యాచ్లలో 332పరుగులు సాధించాడు. ఇక స్ట్రైక్రేట్ అయితే 141కి పైనే. ప్రస్తుతం ఈ సీజన్లో రాజస్థాన్ తరపున బట్లర్ తర్వాత అత్యుత్తమంగా రాణిస్తున్న బ్యాట్స్మెన్ ఇతనే. పరిస్థితులకు తగ్గట్లుగా ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడానికే ప్రయత్నిస్తుంటాడు. అయితే వికెట్ కీపింగ్ విషయంలో మాత్రం కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్నాడు. తాను ప్రాతినిధ్యం వహించే ఫ్రాంఛైజీ జట్టులో అంతకుముందే మరో కీలక వికెట్ కీపర్ ఉండటమే అతనికి ప్రతికూలాంశంగా మారింది. ఇదే రాజస్థాన్ జట్టులో బట్లర్ ప్రపంచ స్థాయి వికెట్ కీపర్ కావడంతో ఇప్పటివరకూ శాంసన్కు కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం రాలేదు.
ఇషాన్ కిషన్:
వికెట్ కీపర్-బ్యాట్స్మెన్గా ఐపీఎల్ 11వ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఇషాన్ కిషన్. ముంబై ఇండియన్స్ ద్వితీయార్థంలో పుంజుకొని ప్లే ఆఫ్ రేసులో నిలిచిందంటే అందులో ఈ యువ ఆటగాడి పాత్ర ఎంతో కీలకం. అటు వికెట్కీపర్గా రాణిస్తూ చక్కని క్యాచ్లు అందుకుంటున్న కిషన్.. బ్యాట్స్మెన్గానూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా తుది జట్టులో స్థానం దక్కించుకుంటున్న ఈ 19ఏళ్ల ఆటగాడు.. ఇప్పటివరకూ ఆడిన 11మ్యాచ్లలో 238పరుగులు సాధించాడు. ఇక వికెట్ కీపర్గానూ ఇప్పటికే 9మంది క్యాచ్లందుకొని మంచి ఫామ్లో ఉన్నాడు.