హైదరాబాద్: రెండ్రోజుల ముందు జరిగిన ఇంగ్లాండ్, పాకిస్థాన్ల మ్యాచ్లో ఇంగ్లాండ్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో కీలకపాత్ర పోషించిన జోస్ బట్లర్ తనను టెస్టు జట్టులోకి ఎంచుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సుదీర్ఘ కాలం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నాడు. కాగా, బట్లర్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననే ధీమాని వ్యక్తం చేశాడు.
'ముందుగా టెస్టు జట్టులో చోటు కల్పిస్తూ పిలుపు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలనే భావించా. పాకిస్తాన్పై భారీ స్కోర్లు సాధించాలనే తలంపుతో బరిలోకి దిగా. ఇక్కడ సక్సెస్ అయ్యాననే చెప్పాలి. ఇందుకు కారణం కచ్చితంగా ఐపీఎలే. ఐపీఎల్లో కీలక సమయాల్లో రాణించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఐపీఎల్లో నన్ను నిరూపించుకోవాలని అనుకున్నా.'
'విదేశీ ఆటగాడికి ఐపీఎల్ వంటి లీగ్లో ఎంత ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఒత్తిడ్ని అధిగమించి వరుస హాఫ్ సెంచరీలు రాణించా. దానికి కొనసాగింపే పాకిస్తాన్తో టెస్టు సిరీస్లో రాణించడం. పాక్పై నా సక్సెస్కు కారణం ఐపీఎల్' అని జోస్ బట్లర్ తెలిపాడు.
పాకిస్తాన్తో లార్డ్స్లో జరిగిన తొలి టెస్టులో బట్లర్ 67 పరుగులతో మెరవగా, లీడ్స్లో జరిగిన రెండో టెస్టులో అజేయంగా 80 పరుగులు నమోదు చేశాడు. ఫలితంగా పాకిస్తాన్తో టెస్టు సిరీస్ను ఇంగ్లాండ్ సమం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆఖరి మ్యాచ్ జరుగుతుండగా బట్లర్ బ్యాట్పై ఉన్న అసభ్య పదజాలాన్ని కెమెరామెన్ చిత్రీకరించడంతో అది కాస్తా వైరల్గా మారింది. దీంతో బట్లర్కు ఐసీసీ నుంచి హెచ్చరికలు అందాయి.