
హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా జరిగిన రాజస్థాన్, ఢిల్లీల మధ్య మ్యాచ్ బుధవారం రాజస్థాన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు చేధనలో ఉండగా వర్షం పడింది. అదే తీవ్ర సమస్యగా మారిందని, రాజస్థాన్ రాయల్స్ చేతిలో బుధవారం రాత్రి ఆ కారణం చేతనే మ్యాచ్ ఓడిపోయామని ఢిల్లీ డేర్డెవిల్స్ సహాయ కోచ్ ప్రవీణ్ ఆమ్రే నిరాశ వ్యక్తం చేశాడు.
ఐపీఎల్లో భాగంగా జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 17.5 ఓవర్లలో 153/5తో నిలిచిన దశలో భారీ వర్షం వచ్చింది. అంపైర్లు తాత్కాలికంగా మ్యాచ్ను నిలిపివేయగా.. దాదాపు రెండన్నర గంటల పాటు మ్యాచ్ సమయం వృథా అయ్యింది. దీంతో.. మ్యాచ్ను 6 ఓవర్లకి కుదించిన అంపైర్లు.. ఢిల్లీ టార్గెట్ని 71 పరుగులుగా నిర్ణయించారు.
ఛేదనలో తడబడిన ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు కుదించిన 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 60 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో 12 బంతుల్లో మాక్స్వెల్ (17), రిషబ్ పంత్ (14), క్రిస్ మోరీస్7 బంతుల్లో (17) నాటౌట్ దూకుడగా ఆడినా.. జట్టుని గెలిపించలేకపోయారు. ముఖ్యంగా మాక్స్వెల్, రిషబ్ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తూ.. బంతుల్ని వృథా చేశారు.
ఈ సందర్భంగా సహాయ కోచ్ ప్రవీణ్ ఆమ్రే మాట్లాడుతూ.. 'వర్షం కారణంగా.. పిచ్ తడిగా మారడంతో.. జారే క్రీజులో బ్యాట్స్మెన్ నిల్చోవడం కష్టమైంది. పిచ్పై కప్పి ఉంచిన కవర్ల కింద కొంత నీరు చేరింది. అలానే ఔట్ఫీల్డ్ కూడా తడిగా ఉండటంతో.. బంతి వేగంగా కదల్లేదు. మొత్తంగా.. జారే పిచ్పై నిలబడి బ్యాట్స్మెన్ హిట్టింగ్ చేయడం కష్టమైంది. మేము తొలుత 5 ఓవర్లలో 62 పరుగుల టార్గెట్ని ఇస్తారని ఆశించాం. కానీ.. 6 ఓవర్లలో 71 ఇచ్చారు. ఇది చాలా కష్టమైన టార్గెట్' అని తెలిపారు.