ముంబై గెలుపు ఎంత పనిచేసింది?: ఫ్లే ఆఫ్కు చేరుకునే రెండు జట్లేవి?

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ మలిదశకు చేరుకుంది. బుధవారం రాత్రి వాంఖడె స్టేడియంలో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడంతో ఫ్లే ఆఫ్స్ రసవత్తరంగా మారాయి. తాజా విజయంతో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానానికి చేరగా, పంజాబ్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.
ముంబై ఇండియన్స్తో పాటు రాజస్థాన్, పంజాబ్ జట్లు కూడా 12 పాయింట్లను కలిగి ఉన్నప్పటికీ, మెరుగైన రన్రేట్ను కలిగి ఉండటంతో ముంబై నాలుగో స్థానంలో నిలిచింది. ఇక, కోల్కతా 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. గురువారం నాటికి టోర్నీలో 50 మ్యాచ్లు పూర్తయ్యాయి.
ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రం ప్లే ఆఫ్స్ బెర్తులను దక్కించుకున్నాయి. మిగతా రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంమలో ప్లే ఆఫ్స్కు చేరుకోవడానికి ఈ జట్లు ఎలా ఆడాలో ఒక్కసారి చూద్దామా....

ముంబై ఢిల్లీపై గెలిస్తేనే
ముంబై ఇండియన్స్ తమ చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే 14 పాయింట్లతో లీగ్ దశను ముగిస్తుంది. ఒకవేళ ఢిల్లీ చేతిలో ఓడితే, పంజాబ్ తన ఆఖరి మ్యాచ్లో చెన్నై చేతిలో ఓడటంతోపాటు సన్రైజర్స్ చేతిలో బెంగళూరు, రాజస్థాన్ ఓడాలి. అలా జరిగితే ముంబై, పంజాబ్, బెంగళూరు, రాజస్థాన్ జట్లు 12 పాయింట్లతో లీగ్ దశను ముగిస్తాయి. మెరుగైన నెట్ రన్రేట్ ఆధారంగా ముంబై ప్లేఆఫ్కు అర్హత సాధిస్తుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లే ఆఫ్కు చేరాలంటే
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆదివారం తన చివరి లీగ్ మ్యాచ్ని చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ విజయం సాధిస్తే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. అదే సమయంలో ఢిల్లీ ముంబైని ఓడించడంతోపాటు.. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ చేతుల్లో బెంగళూరు ఓడాలి. దీంతో మిగతా మూడు జట్లు 12 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఫలితంగా పంజాబ్ ప్లేఆఫ్కు అర్హత సాధిస్తుంది.

రాజస్థాన్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే
అజ్యింకె రహానే సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ సీజన్ ఆరంభంలో పేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ... చివర్లో అనూహ్యంగా పుంజుకుంది. లీగ్లో భాగంగా రాజస్థాన్ తన చివరి మ్యాచ్లో బెంగళూరుపై గెలిచి.. ముంబై చివరి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడితే ఆ జట్టు ప్లేఆఫ్ చేరుతుంది.

బెంగళూరు చివరి రెండు మ్యాచ్లు నెగ్గాల్సిందే
తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై బెంగళూరు భారీ తేడాతో గెలుపొందడం ఆ జట్టుకు కలిసొచ్చింది. ఎందుకంటే బెంగళూరు తన నెట్ రన్రేట్ను ఎంతగానో మెరుగుపర్చుకుంది. గురువారం సన్రైజర్స్పై, శనివారం రాజస్థాన్పై గెలిస్తే.. బెంగళూరు జట్టు ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. అదే సమయంలో ముంబై, కోల్కతా జట్లు తమ చివరి మ్యాచ్ల్లో ఓడాల్సి ఉంటుంది.

కోల్కతా ప్లేఆఫ్ చేరాలంటే
బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్పై గెలవడంతో కోల్కతా పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది. సన్రైజర్స్తో శనివారం జరిగే చివరి మ్యాచ్లో గెలిస్తే 16 పాయింట్లతో ఆ జట్టు ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ చివరి మ్యాచ్లో ఆ జట్టు ఓడి.. ముంబై, బెంగళూరు జట్లు తదుపరి మ్యాచ్ల్లో గెలిస్తే మాత్రం రన్రేట్ లేని కారణంగా కోల్కతా ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications