పదేళ్లుగా ఆర్సీబీ జట్టులో విరాట్:
‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానుల కంటే ఎక్కువగా నాకే ఎక్కువగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవాలని ఉంది. పదేళ్లుగా ఆర్సీబీ జట్టులో ఉన్నాను. మూడు సార్లు(2016, 2011, 2009) ఫైనల్ వరకు వెళ్లాం. కానీ, ట్రోఫీ అందుకోలేకపోయాం. ఈ సారి మాత్రం మా జట్టు ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. 120 శాతం కష్టపడతాం' అని కోహ్లీ తెలిపాడు.
బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లోనూ బలంగా:
‘గతంలో మా జట్టు ఒక్క బ్యాటింగ్లోనే బలంగా ఉండేది. కానీ, ఈ ఏడాది మా బౌలింగ్ను పదునెక్కించాం. కాబట్టి ఈసారి ఆర్సీబీ విజేతగా నిలిచేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి' అని కోహ్లీ చెప్పాడు. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
జట్టులోకి కొత్త ఆటగాళ్లు:
జట్టు గురించి మాట్లాడుతూ.. ఈ సారి జరిగిన వేలం ద్వారా జట్టులోకి కొత్త ఆటగాళ్లు చేరారు. వాళ్లలో గెలవాలనే ఉత్సుకత బాగానే కనపడుతోంది. మునుపటి సీజన్ వరకు ఉన్న జట్ల కంటే ఈ సారి బౌలింగ్ సత్తా ఎక్కువ ఉన్న ఆటగాళ్లతో తయారవుతున్నాం. వాళ్లలో చాలామంది వరకు నాకు వ్యక్తిగతంగా కూడా తెలిసిన వాళ్లే ఉన్నారు. ట్రోఫీ గెలిచేందుకు మా తరపునుంచి 120% కష్టపడతాం అని పేర్కొన్నాడు.
అందుబాటులో ఉన్న బౌలర్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు అందుబాటులో ఉన్న బౌలర్లు. యుజవేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, ఎమ్ అశ్విన్, పవన్ నేగి, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ, ఉమేశ్ యాదవ్ పర్యవేక్షణలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్, ఢిల్లీకి చెందిన నవదీప్ సైనీ, మొహమ్మద్ సిరాజ్, న్యూజిలాండర్ టిమ్ సౌతీలు పేస్ బౌలింగ్ తో వికెట్లు తీయగలరని ఆశిస్తున్నట్లు తెలిపాడు కోహ్లీ.
హైదరాబాద్ నగరానికి ఐపీఎల్ ట్రోఫీ:
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ ట్రోఫీ హైదరాబాద్ నగరానికి వచ్చింది. దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ప్రదర్శించనున్న ఈ ట్రోఫీ హైదరాబాద్ చేరుకుంది. ఓ ప్రైవేట్ షోరూమ్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ భారత స్పిన్నర్ ఎస్ఎల్ వెంకటపతి రాజు ఐపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు.