ఆరు హాఫ్ సెంచరీలు సాధించిన కేఎల్ రాహుల్
ఐపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ కేఎల్ రాహుల్ (ఆరు హాఫ్ సెంచరీలతో 652 పరుగులు), అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్ క్యాప్(24 వికెట్లు)ను పంజాబ్ జట్టు సొంతం చేసుకున్నప్పటికీ... పంజాబ్ మాత్రం మ్యాచ్లు గెలవలేకపోతోంది.
పంజాబ్ జట్టు సమిష్టిగా రాణించలేక పోవడమే
ఆటగాళ్లు వ్యక్తిగతంగా అద్భుత ఆటతీరుని కనబరుస్తున్నా... జట్టు మాత్రం సమష్టిగా రాణించలేకపోతుంది. ఈ సీజన్లో గత మ్యాచ్ల్లో కోల్కతాపై 66 పరుగులు చేసిన రాహుల్, తర్వాత రాజస్థాన్ మీద 95 పరుగులతో అజేయంగా నిలిచినప్పటికీ.. జట్టును మాత్రం విజయ తీరాలకు చేర్చలేకపోతున్నాడు.
ఎవరూ క్రీజులో నిలవడం లేదు
మరోవైపు బౌలర్ ఆండ్రూ టై వికెట్లు తీస్తున్నా, రాహుల్ చివరి వరకూ క్రీజులో నిలుస్తున్నా వీరికి అండగా నిలిచేవారే కరువయ్యారు. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆండ్రూ టై వెల్లడించాడు. 'ముజీబ్, నేను తప్పితే ఎవరూ వికెట్లు తీయలేకపోతున్నారు. రాహుల్తో కలిసి ఎవరూ క్రీజులో నిలవడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశాడు.
పంజాబ్ ఓటమికి కారణం ఇదే
ఐపీఎల్ 11వ సీజన్ ఆరంభంలో రాణించిన క్రిస్ గేల్, కరుణ్ నాయర్లు చివరిదశకు వచ్చే సరికి పూర్తిగా విఫలమయ్యారు. ఐపీఎల్ రెండో అర్ధభాగంలో కేఎల్ రాహుల్ మినహా మరే పంజాబ్ బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. పంజాబ్ ఓటమికి ఇదే కారణమని ఆండ్రూ టై వివరించాడు.
చెన్నై చేతిలో ఓడితే ప్లేఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే
ఇదిలా ఉంటే బుధవారం రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్లో చేధనలో యువరాజ్, మనోజ్ తివారీలను కాదని అక్షర్ పటేల్, స్టోయినిస్లను ముందుగా బ్యాటింగ్కు పంపడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. బుమ్రా బౌలింగ్లో మూడు బంతుల వ్యవధిలో ఫించ్, స్టొయినిస్ అవుటవడంతో పంజాబ్ ఒత్తిడికిలోనై ఓటమిపాలైంది. ఈ సీజన్లో తన తదుపరి మ్యాచ్లో పంజాబ్ జట్టు చెన్నైతో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఓడితే పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే.