
హైదరాబాద్: వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ భారత జట్టులోకి పునరాగమనం చేసిన విధానం తనకు ఎంతగానో నచ్చిందని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె అన్నారు. శ్రీలంక వేదికగా నిదాహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో చివరి బంతికి సిక్స్ బాది భారత్కు అద్భుత విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
ఈ ఒక్క షాట్తో దినేస్ కార్తిక్ రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు. ఐపీఎల్ 11వ సీజన్లో దినేశ్ కార్తీక్ కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా వ్యవహారిస్తున్నాడు. ఓ కార్యక్రమానికి హాజరైన కిరణ్ మోరె మాట్లాడుతూ 'దినేశ్కార్తీక్ పునరాగమనం చేసిన విధానం నాకు నచ్చింది. అయితే అతడు గతంలో వికెట్ కీపింగ్ వదిలేసి బ్యాట్స్మన్గా ఆడటం నన్ను అసంతృప్తికి గురిచేసింది' అని అన్నాడు.
'ఏమైందని అతడిని నేను చాలా సార్లు అడిగాను. కానీ ధోనీ టెస్టుల నుంచి రిటైర్ అయి, వన్డే, టీ20ల్లో ఆడుతున్న తరుణంలో కీపర్ బ్యాట్స్మన్గా అతడు పునరాగమనం చేశాడు. ఒక వికెట్ కీపర్గా మనగలగడం అంత సులభం కాదు. దినేశ్ చాలా మంచి క్రికెటర్. అతడు కెరీర్లో చాలా సాధించాడు. ఇంకా సాధించాల్సి ఉంది' అని పేర్కొన్నాడు.
ఇక, ఐపీఎల్లో టీమిండియా వికెట్ కీపర్లు ఉంటే జట్టుకు సమతూకంగా ఉంటుందని అన్నాడు. 'భారత వికెట్ కీపర్ జట్టుకు సమతూకం తెస్తాడు. ఇషాన్ కిషన్, రిషబ్పంత్, వృద్ధిమాన్ సాహా, దినేశ్, పార్థివ్ పటేల్ రూపంలో మనకు మంచి కీపర్లు ఉన్నారు. సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, సాహా శతకాలు సైతం బాదేశారు' అని తెలిపాడు.