
హైదరాబాద్: రెండేళ్ల నిషేదం అనంతరం సొంతగడ్డపై చెలరేగి ఆడిన చెన్నై జట్టుకు శుభారంభమే వచ్చింది. అయితే కోల్కతా జట్టు ఆటగాడికి మాత్రం ట్విట్టర్ వేదికగా చివాట్లు తప్పలేదు. కారణం.. మ్యాచ్ చివర్లో అనూహ్యంగా చెన్నై జట్టుకు విజయం రావడానికి కారణమవడమే. మ్యాచ్ చివర్లో ఉండగా అప్పటివరకూ నిదానంగా సాగిన ఇన్నింగ్స్ చివరి నాలుగు ఓవర్లలో ఆండ్రూ రసెల్ 88(36) ధాటికి ఏకంగా 20ఓవర్లకు 202 పరుగులకు చేరుకుంది.
ఆశల్లేని స్థితిలో నుంచి చెన్నై మరోసారి అద్భుత పోరాటం చేసి కోల్కతా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి 5వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు ఓపెనర్లు షేన్ వాట్సన్ 42(19), రాయుడు 39(26) చెన్నైకి మెరుపు ఆరంభాన్నిచ్చింది. శామ్ బిల్లింగ్స్ 56(23) మెరుపులతో భారీ లక్ష్యాన్ని చేరుకునే దిశగా పరుగులు తీస్తూ.. వచ్చాడు. ఈ క్రమంలో 19ఓవర్లలో బిల్లింగ్స్ షాట్కు ప్రయత్నించి ఉతప్ప చేతికి చిక్కాడు.
దీంతో చెన్నై విజయం సాధించడానికి చివరి ఓవర్లో మరో 17పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో బంతి అందుకున్న కోల్కతా బౌలర్ వినయ్ కుమార్ తొలి బంతినే నోబాల్గా విసిరాడు. క్రీజులో ఉన్న డ్వేన్ బ్రావో దాన్ని ఏకంగా సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత సింగిల్స్తో లక్ష్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. 19.5 బంతిని భారీ సిక్సర్గా మలిచి జడేజా అద్భుత విజయాన్ని అందించాడు.
దీంతో నిరాశకు గురైన అభిమానులు చెన్నైతో జరిగిన మ్యాచ్లో వినయ్ కుమార్ ప్రదర్శన పట్ల ట్విటర్లో పెదవి విరిచారు. చేజేతులా మ్యాచ్ను కోల్పోయేలా చేశావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వెంటనే దీనిపై స్పందించిన వినయ్ ' ఇది కేవలం ఆట మాత్రమే. కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. అలా అంటే ఆర్సీబీపైన 9పరుగులను, ముంబయిపైన 10పరుగులను కాపాడినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారంటూ' ట్వీట్ చేశాడు.