ఆరు భాషల్లో కామెంటేటర్లు
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు తెలుగులో ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు ఆరు భాషల్లో కామెంటేటర్ల జాబితాను విడుదల చేశారు. తెలుగులో వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు, కల్యాణ్ కృష్ణ, సి.వెంకటేశ్, చంద్రశేఖర్, పి.సుధీర్ మహావడి కామెంటేటర్లుగా వ్యవహారించనున్నారు.
హిందీ కామెంటరీ ప్యానెల్లో వీవీఎస్ లక్ష్మణ్
ఇంగ్లీష్, హిందీ, బంగ్లా, కన్నడ, తమిళ్, తెలుగు భాష్లలో ఐపీఎల్ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ హిందీ కామెంటరీ ప్యానెల్లో చోటు దక్కించుకున్నాడు. ఆరు భాషల్లో కలిపి సుమారు 100 మందికిపైగా కామెంటేటర్లు పనిచేయనున్నారు.
హైదరాబాద్ నగరానికి వచ్చిన ఐపీఎల్ ట్రోఫీ
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ ట్రోఫీ హైదరాబాద్ నగరానికి వచ్చింది. దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ప్రదర్శించనున్న ఈ ట్రోఫీ హైదరాబాద్ చేరుకుంది. ఓ ప్రైవేట్ షోరూమ్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ భారత స్పిన్నర్ ఎస్ఎల్ వెంకటపతి రాజు ఐపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు.
ఐపీఎల్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఐపీఎల్ ట్రోఫీ నగరానికి రావడం ఆనందంగా ఉంది. దేశాల మధ్య సరిహద్దులను చెరిపిన ఐపీఎల్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ఈ టోర్నీ ద్వారా చాలామంది ఆటగాళ్లు స్టార్లుగా మారారు. స్థానిక ఆటగాళ్లకు అవకాశాలిస్తూ వాళ్ల ప్రతిభను ప్రపంచానికి చాటుతోంది' అని అన్నారు.
నా మద్దతు సన్రైజర్స్కే
'అంతర్జాతీయ ఆటగాళ్ల వల్ల ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ తమ సత్తాచాటుతున్నారు. హైదరాబాదీగా నా మద్దతు సన్రైజర్స్కే ఉంటుంది. ఈ సారి సన్రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలవాలని కోరుకుంటున్నా. డేవిడ్ వార్నర్ను మిస్ అయ్యామనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు' అని అన్నాడు.
తెలుగులో కామెంటేటరీ చేయడం మంచి అనుభూతి
తెలుగులో కామెంటేటరీ చేయడం మంచి అనుభూతిగా ఉంటోంది. వీక్షకులతో అనుసంధానం చేస్తుంది. ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీలో కామెంటరీని ఇష్టపడని వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని ఆయన అన్నారు. ఐపీఎల్ 11వ సీజన్కు అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తోన్న టాటా నెక్జాన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏప్రిల్ 7న ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభంకానుంది.