
హైదరాబాద్: ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టులో ఊహించని పరిణామం. ఐపీఎల్ 11వ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న గౌతమ్ గంభీర్ బుధవారం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో జట్టులోని మిడిలార్డర్ బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది జట్టు యాజమాన్యం.
ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో ఢిల్లీ డేర్డెవిల్స్ గౌతమ్ గంభీర్ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ సీజన్లో గంభీర్ను కెప్టెన్గా నియమించింది. గంభీర్ నాయకత్వంలోని జట్టు అద్భుత విజయాలను సాధిస్తుందని అనుకుంటే వరుస ఓటములతో ఢీలాపడింది.
ఈ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి, మిగిలిన ఐదు మ్యాచ్ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ ఓటమి బాధ్యత వహిస్తూ గంభీర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ 'ఇది నా నిర్ణయం. జట్టుకు విజయానికి తగినంతగా నేను కృషి చేయలేదు. ఓటమికి కూడా బాధ్యతగా బాధ్యత వహించాలి. ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. శ్రేయస్ అయ్యర్ నూతన కెప్టెన్గా ఢిల్లీ డేర్డెవిల్స్ బాధ్యతలు స్వీకరిస్తాడు. అతడికి నా సహకారం ఎప్పటికీ ఉంటుంది' అని గంభీర్ పేర్కొన్నాడు.
కోల్కతా నైట్రైడర్స్లో కెప్టెన్గా, ప్లేయర్గా సక్సెసైన గంభీర్.. అదే ఫామ్ను ఢిల్లీ టీమ్తో కొనసాగించలేకపోయాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లాడిన గంభీర్ కేవలం 85 పరుగులు మాత్రమే చేశాడు. మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో మాత్రం గంభీర్ (55) హాఫ్ సెంచరీతో రాణించాడు.
మిగితా అన్ని మ్యాచ్ల్లో కూడా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. 2010లో కూడా గంభీర్ ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ సీజన్లో ఢిల్లీ ఐదో స్ధానంలో నిలిచింది. ఆ తర్వాత కొన్ని సీజన్లు గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడాడు. గంభీర్ నాయకత్వంలోని కోల్కతా నైట్రైడర్స్ రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
ఈ సీజన్లో కోల్కతా నుంచి ఢిల్లీకి తిరిగి రావడంతో గంభీర్పై ఆ టీమ్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆరు మ్యాచులైనా గంభీర్ ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కెప్టెన్సీ మార్పు చేయాల్సి వచ్చింది. కెప్టెన్సీ భారం దిగిపోవడంతో గంభీర్ బ్యాట్తో రాణిస్తాడని టీమ్ భావిస్తోంది.