హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు. మైదానంలో వికెట్ల వెనుక ఎంతో చురుగ్గా ఉంటాడు. మెరుపు వేగంతో బ్యాట్స్మెన్ను స్టంపౌట్ చేసిన సందర్భాలను చాలానే చూశాం. అంతర్జాతీయ క్రికెట్లో అమల్లోకి వచ్చిన అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)పై ధోనికి అద్భుతమైన అవగాహన ఉంది.
ఎంతలా ఉంటే DRS అంటే ధోని ధోని రివ్యూ సిస్టమ్ అనేంతలా. తాజాగా ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్లో గురువారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ధోని అంపైర్ను సమీక్ష కోరి సక్సెస్ అయ్యాడు. కోల్కతా ఇన్నింగ్స్ తొలి ఓవర్లో లుంగి ఎంగిడి వేసిన ఆఖరి బంతిని క్రిస్లిన్ ఎదుర్కొన్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
బ్యాట్ అంచును తాకిన బంతి అతని కాలి ప్యాడ్ను తాకి స్లిప్లో ఉన్న షేన్ వాట్సన్ చేతిలో పడింది. దీంతో బాలర్ ఎంగిడితో పాటు ధోని, వాట్సన్ అంపైర్ను అప్పీల్ కోరారు. అంపైర్ నాటౌట్గా ప్రకటించడంతో పక్కనున్న వాట్సన్ను సంప్రదించి ధోని రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి బ్యాట్కు తాకినట్లు తేలడంతో క్రిస్లిన్ మైదానాన్ని వీడాడు.
బంతి క్రిస్ లిన్ బ్యాట్ను తాకినట్లు స్పష్టత లేకపోవడంతో రివ్యూ కోరేందుకు ఏ ఆటగాడు పెద్దగా ఆసక్తి చూపించలేదని మ్యాచ్ చూసిన క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ధోని మాత్రం డీఆర్ఎస్ను కోరి విజయవంతం కావడంతో... DRS అంటే ధోనీ రివ్యూ సిస్టమ్ అని ఎందుకు పిలుస్తారో నిరూపించాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.