వాంఖడెలో మ్యాచ్ అంటేనే ఓ థ్రిల్
‘ఈ ఏడాది ఐపీఎల్ కోసం బాగా సిద్ధమయ్యాం. కొంత ఆందోళనగా ఉన్నా.. వాంఖడే స్టేడియంలో మ్యాచ్ అంటే ఓ థ్రిల్ ఉంటుంది. ఈ సీజన్లో మా జట్టు తొలి మ్యాచ్ వాంఖడేలోనే ఆడుతుంది. ముంబై ఇండియన్స్పై గెలిచి టోర్నీకి శుభారంభం ఇవ్వాలని అనుకుంటున్నాం' అని ప్లెమింగ్ అన్నాడు.
ఆటగాళ్లు ఈ గేమ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు
'ఆటగాళ్లు కూడా ఈ రోజు గేమ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనుభవం ఉన్న ఆటగాళ్లే ఈ టోర్నీలో కీలకపాత్ర పోషిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మహేంద్ర సింగ్ ధోని, డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, హర్భజన్ సింగ్లు మా జట్టును ముందుకు నడిపిస్తారు. ఈ ఏడాది మా జట్టు ఎంతో బలంగా ఉంది' అని ఫ్లెమింగ్ తెలిపాడు.
గాయం కారణంగా తొలి మ్యాచ్కి డుప్లెసిస్ దూరం
ఇదిలా ఉంటే చేతి వేలు గాయం కారణంగా ముంబై ఇండియన్స్తో జరిగే తొలి మ్యాచ్లో డుప్లెసిస్ ఆడటం లేదని ఫ్లెమింగ్ ఈ సందర్భంగా తెలిపాడు. ఐపీఎల్ 11వ సీజన్ తొలి మ్యాచ్కు గంటన్నర ముందే ఐపీఎల్ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఐపీఎల్ 11వ సీజన్కు అట్టహాసంగా తెరలేవనుంది.
ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ తారలు అదనపు ఆకర్షణ
కిక్కిరిసిన అభిమానుల మధ్య లీగ్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ తారలు అదనపు ఆకర్షణగా నిలువనున్నారు. గంటల పాటు సాగే ఈ వేడుకలో బాలీవుడ్ తారలు తళుక్కుమనబోతున్నారు. హృతిక్ రోషన్, తమన్నా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు నృత్యాలతో అభిమానులను కనువిందు చేయనున్నారు. మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.