బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో టైటిల్ సాధించాలన్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అడుగు దూరంలో నిలిచింది. శతకబాదడం అలవాటుగా మార్చేసుకున్న కోహ్లీ ఈసారి డకౌట్ అయ్యాడు. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ విఫలమయ్యాడు. ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ కూడా సున్న పరుగులకే ఔటయ్యాడు.
వాట్సన్ కూడా విఫలమైనా వేళ ఏబి డివిలియర్స్ విధ్వంసాన్ని సృష్టించాడు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 28 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన వేళ.. ఫైనల్ బెర్తు సొంతమైపోయినట్లు గుజరాత్ లయన్స్ ఆటగాళ్లలో ఆనందం కనిపించింది. కానీ, ఏబీ డివిలియర్స్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలువనీయలేదు.
బెంగళూరులోని సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన తొలి క్వాలిఫయర్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో టేబుల్ టాపర్ గుజరాత్ లయన్స్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించి 47 బంతుల్లో అజేయంగా 79(5ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు సాధించిన ఏబి డివిలియర్స్ రాయల్ చాలెంజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రతికూల పరిస్థితుల్లో పతాక స్థాయి విధ్వంసం సాగించిన ఏబీ.. ఆర్సీబీకి ఐపీఎల్-9 ఫైనల్ బెర్తు సాధించిపెట్టాడు.
అంతకుముందు టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ ఆరంభంలో ఘోరంగా తడబడింది. ఇక్బాల్ అబ్దుల్లా బౌలింగ్లో ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (4), బ్రెండన్ మెక్కలమ్ (1)తో పాటు షేన్ వాట్సన్ బౌలింగ్లో కెప్టెన్ సురేష్ రైనా (1) స్వల్పస్కోర్లకే పెవిలియన్కు పరుగెత్తడంతో గుజరాత్ లయన్స్ 9 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
ఈ తరుణంలో మిడిలార్డర్ బ్యాట్స్మన్ డ్వెయిన్ స్మిత్ క్రీజ్లో నిలదొక్కుకుని బాధ్యతాయుతంగా ఆడాడు. సెకెండ్ డౌన్ బ్యాట్స్మన్గా దిగిన వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న స్మిత్ నాలుగో వికెట్కు 85 పరుగులు జోడించి లయన్స్ను ఆదుకున్నాడు.
అనంతరం కార్తీక్ (30 బంతుల్లో 24 పరుగులు)ను 14వ ఓవర్లో క్రిస్ జోర్డాన్ క్లీన్ బౌల్డ్ చేయగా, అతని స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా (7 బంతుల్లో 3 పరుగులు)తో పాటు స్మిత్ (41 బంతుల్లో 73 పరుగులు) 21 పరుగుల వ్యవధిలో నిష్క్రమించారు.
ఆ తర్వాత డ్వెయిన్ బ్రావో (8), ప్రవీణ్ కుమార్ (1) విఫలమైనప్పటికీ ఏకలవ్య ద్వివేదీ (9 బంతుల్లో 19 పరుగులు), ధవళ్ కులకర్ణి (4 బంతుల్లో 10 పరుగులు) కొద్దిసేపు ధాటిగా ఆడి 30 పరుగులు జోడించారు. చివర్లో షాదబ్ జకాతీ (1) నాటౌట్గా నిలవడంతో గుజరాత్ లయన్స్ జట్టు 20 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ జట్టులో ఫస్ట్డౌన్ ఆటగాడు ఏబి డివిలియర్స్ మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్లంతా ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (0), ఓపెనర్ క్రిస్ గేల్ (0)తో పాటు వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ (0), షేన్ వాట్సన్ (1), సచిన్ బాబీ (0) చేతులెత్తేయడంతో గుజరాత్ లయన్స్ 29 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
అయితే స్టూవర్ట్ బిన్నీ (21)తో కలసి ఆరో వికెట్కు 39 పరుగులు జోడించిన డివిలియర్స్ అద్భుతంగా ఆడి 47 బంతుల్లో 79 పరుగులు సాధించడంతో పాటు ఇక్బాల్ అబ్దుల్లా (25 బంతుల్లో 33 పరుగులు)తో కలసి అజేయంగా మిగిలిన పని పూర్తి చేశాడు. దీంతో 18.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించిన రాయల్ చాలెంజర్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 'లయన్స్'ను ఓడించింది.
గుజరాత్కు మరో ఛాన్స్
అయితే ఈ మ్యాచ్లో 'లయన్స్' ఓటమిపాలైనప్పటికీ ఆ జట్టు టైటిల్ రేసు నుంచి వైదొలగలేదు. శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్లో విజయం సాధిస్తే గుజరాత్ లయన్స్కు కూడా ఫైనల్ బెర్తు ఖరారవుతుంది.