లండన్: తిరిగి ఇంగ్లాండ్కు ఆడాలన్న కెవిన్ పీటర్సన్ కల కల్లలయ్యేలా కనిపిస్తోంది. సర్రే తరఫున ఆడుతూ అతను ట్రిపుల్ సెంచరీ చేశాడు. 349 బంతుల్లో 34 ఫోర్లు, 15 సిక్స్లతో 355 పరుగులుచేశాడు. అయితే, అతడి విషయంలో ఇంగ్లాండ్ క్రికెట్ యాజమాన్యం వైఖరిలో మాత్రం మార్పులేదు.
పీటర్సన్ను తిరిగి జట్టులోకి తీసుకోబోమని చెప్పారు. ఇంగ్లాండ్ క్రికెట్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్.. పీటర్సన్తో సమావేశం అనంతరం ఈ విషయం చెప్పాడు. పీటర్సన్ పైన తమకు విశ్వాసం లేదన్నాడు. పీటర్సన్ గొప్ప ఆటగాడని, తమ సమస్య అథడి సామర్థ్యం గురించి కాదని, అతడి పైన నమ్మకం కుదరకపోవడమేనని చెప్పాడు.
కొన్ని రోజుల్లో విశ్వాసం పొందడం సాధ్యం కాదన్నాడు. తాను పీటర్సన్తో మాట్లాడానని, తమ ప్రణాళికల్లో ప్రస్తుతం అతడు భాగం కాదని చెప్పానని, భవిష్యత్తు గురించి కూడా తాను హామీ ఇవ్వలేనని చెప్పానని తెలిపాడు. ఇంగ్లాండుకు ఆడకుండా అతడి పైన ఎలాంటి నిషేధం లేదన్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమన్నాడు.
స్ట్రాస్, పీటర్సన్ మధ్య సంబంధాలు సరిగా లేవని, 2012లో దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు స్ట్రాస్ను విమర్శిస్తూ పీటర్సన్ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు సందేశం పంపడం కలకలం రేపింది. ఆ తర్వాత అతడిని జట్టు నుండి తప్పించారు. పునరాగమనం చేసినా.. విభేదాలకు కారణమవుతున్నాడని ఎక్కువ కాలం కొనసాగలేదు.
హర్టయ్యాడు, ఆగ్రహం.. ఐపీఎల్కు
ఇంగ్లాండ్ జట్టు ప్రణాళికల్లో పీటర్సన్ లేడని ఇంగ్లాండ్ క్రికెట్ యాజమాన్యం ప్రకటించడంతో పీటర్సన్ కెరీర్ పైన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.
ఇంగ్లాండు జట్టులో చోటు కోసం ఐపీఎల్కు దూరమయ్యాడు. ఇప్పుడు ఆశలు ఆవిరి కావడంతో.. అతడు ఐపీఎల్కు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడైన అతను సుక్రవారం భారత్ వస్తాడని తెలుస్తోంది.