హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్తో బెంగళూరు వేదికగా జరిగే చారిత్రాత్మక టెస్టు మ్యాచ్కి వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా దూరమయ్యే అవకాశం ఉంది. గతేడాది టెస్టు హోదా దక్కించుకున్న ఆప్ఘనిస్థాన్ తన తొలి టెస్టు మ్యాచ్ని జూన్ 14న టీమిండియాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది.
ఆదివారంతో ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వృద్ధిమాన్ సాహా... టోర్నీలో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో గాయపడ్డాడు. దీంతో సాహా చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన ఫైనల్కు దూరమయ్యాడు.
తాజాగా వృద్ధిమాన్ సాహాకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఐదు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. ఇదే విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం బీసీసీఐకి తెలిపింది. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్తో జరిగే ఏకైక టెస్టుకు సాహా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆప్ఘనిస్థాన్తో టెస్టు నాటికి సాహా కోలుకోకపోతే దినేశ్ కార్తీక్ లేదా పార్ధివ్ పటేల్తో సాహా స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయనుంది. 33 ఏళ్ల సాహా ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో 10 ఇన్నింగ్స్లాడి మొత్తం 122 పరుగులు నమోదు చేశాడు. ఆప్ఘనిస్థాన్ టెస్టు తర్వాత కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది.
ఆరు వారాల తర్వాత కూడా సాహా గాయం నుంచి కోలుకోకపోతే ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్కు కూడా అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఐదు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.