ఆక్లాండ్: స్వదేశంలో భారత్ ప్రస్తుతం శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఆ వెంటనే సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్ల అనంతరం న్యూజిలాండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఆ పర్యటనలో ఇరు జట్లు ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి. జనవరి 24 నుంచి కివీస్లో కోహ్లీసేన పర్యటించనుంది.
లక్ష్మణ్ టీ20 ప్రపంచకప్ జట్టు.. ధోనీకి దక్కని చోటు.. ఓపెనర్గా రాహుల్!!
న్యూజిలాండ్ సిరీస్ కోసం భారత్ ఇప్పటినుండే కసరత్తులు చేస్తోంది. మరోవైపు కివీస్ కూడా సొంతగడ్డపై చెలరేగేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సిరీస్ ఆరంభం కాకముందే న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, వికెట్కీపర్ బ్యాట్స్మన్ టామ్ లేథమ్ భారత్తో సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని సమాచారం తెలుస్తోంది.
తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్లో బౌల్ట్, లేథమ్ తీవ్రంగా గాయపడ్డారు. బౌల్ట్ బ్యాటింగ్ చేస్తుండగా.. పేసర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి అతడి కుడిచేతికి బలంగా తగిలింది. దీంతో ఎముకలో సాధారణ చీలిక వచ్చింది. అవసరమైన మ్యాచుల్లో తప్ప అతడి సేవలు వినియోగించుకోబోమని కివీస్ కోచ్ గ్యారీస్టీడ్ పేర్కొన్నాడు. అయితే వారం రోజుల్లో బౌల్ట్ కోలుకునే అవకాశం ఉంది.
మూడో టెస్టులో మార్నస్ లబుషేన్ ఇచ్చిన క్యాచ్ను అందుకొనే క్రమంలో కీపర్ టామ్ లేథమ్ కుడిచేతి చిటికెన వేలుకు గాయమైంది. మూడో టెస్టులో నాలుగో రోజు ఆసీస్ డిక్లర్ ఇచ్చేముందు గాయపడ్డాడు. ఎక్స్రే నివేదికలో లేథమ్ వేలు విరిగినట్టు తేలింది. దీంతో అతడికి కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరమం వైద్య బృందం పేర్కొంది. గాయాలతో బౌల్ట్, లేథమ్ భారత్తో సిరీస్లో ఆడేది అనుమానంగా మారింది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరమైతే న్యూజిలాండ్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టే.