న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకోని పునరగమనాన్ని ఘనంగా చాటుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో బుమ్రా బౌలింగ్ అత్యద్భుతమని కొనియాడాడు. ముఖ్యంగా అతని డెత్ బౌలింగ్ భారత విజయంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించాడు.
ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికిండు : అక్తర్
'సీనియర్ బౌలర్గా బుమ్రా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించాడు. వికెట్లు పడగొట్టకపోయినా పరుగులను నియంత్రించి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఒత్తిడికి గురిచేశాడు. దీనివల్లే ఇతర బౌలర్లు వికెట్లు తీయగలిగారు. గత రెండు మ్యాచ్ల్లో బుమ్రా డెత్ బౌలింగ్ ఔట్స్టాండింగ్. కొత్త బంతితో అతను వేసిన కొన్ని బంతులు ఎంతో ప్రత్యేకం.'అని ప్రశంసల జల్లు కురిపించాడు.
ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లో బుమ్రా ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. కానీ తన పేస్తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో మిగతా బౌలర్లు సులువుగా వికెట్లు తీయగలిగారు. వికెట్లు తీయకున్నా సీనియర్ బౌలర్గా విజయంలో కీలక పాత్రపోషించాడు. ఎంతాలా అంటే అతను విఫలమైన మ్యాచ్లో భారత్ ఓడిపోయేంత. వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో బుమ్రా ఘోరంగా విఫలమయ్యాడు. దారుణంగా పరుగులు ఇచ్చాడు. దీంతో భారత్ 10 వికెట్లతో చిత్తుగా ఓడింది. అనంతరం జరిగిన రెండు మ్యాచ్ల్లో బుమ్రా అదరగొట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లే, డెత్ ఓవర్లలో పరుగులను కట్టడిచేశాడు.
ఆ విషయం ధోనికి బాగా తెలుసు.. కోహ్లీ కెప్టెన్సీపై సెహ్వాగ్ పరోక్ష వ్యాఖ్యలు
గతేడాది వెస్టిండీస్ పర్యటనలో గాయపడి జట్టుకు దూరమైన బుమ్రా.. ఇటీవల స్వదేశంలో జరిగిన శ్రీలంక టీ20 సిరీస్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్లో తన మార్క్ బౌలింగ్ను చూపించకపోయినా పర్వాలేదనిపించాడు. ఇక ఆసీస్ సిరీస్లో ముఖ్యంగా చివరి రెండు వన్డేల్లో తన సత్తా ఏంటో తెలియజేశాడు. ఇక ఇదే జోరును న్యూజిలాండ్ టూర్లో చూపించేందుకు ఈ యార్కర్ల స్పెషలిస్ట్ సమాయత్తం అవుతున్నాడు. ఈ టూర్లో భాగంగా భారత్ జనవరి 24 నుంచి 5 టీ20, మూడు వన్డేలు, రెండు టెస్ట్లు ఆడనుంది. ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వన్డే, టెస్ట్ టీమ్స్ ఎంపికచేయాల్సి ఉంది.