
కూలిడ్జ్: భారత ఆటగాళ్లు తొలిసారిగా కొత్త జెర్సీలతో మైదానంలోకి అడుగుపెట్టారు. విండీస్ ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల టెస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు శనివారం కొత్త జెర్సీలతో బరిలోకి దిగారు. టెస్టు మ్యాచ్ల్లో ఆటగాళ్లను గుర్తించేందుకు ఐసీసీ ఇటీవల కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు, నంబర్లకు ఐసీసీ అనుమతిచ్చింది. యాషెస్ తొలి టెస్టు నుంచే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు కొత్త జెర్సీలను ధరించి ఆడాయి.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు కొత్త జెర్సీలతో టెస్టు క్రికెట్ ఆడాయి. ఈ నాలుగు జట్ల అనంతరం భారత ఆటగాళ్లు తమ కొత్త జెర్సీలను ధరించారు. శనివారం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తమ కొత్త జెర్సీలతో మైదానంలోకి అడుగుపెట్టారు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఇక మ్యాచ్ జరుగుతుండగా మరొకొన్ని పోటోలను కూడా బీసీసీఐ షేర్ చేసింది. అందులో పుజారా, పంత్, విహారి, రోహిత్ ఉన్నారు. రోహిత్ 45 నెంబర్ ఉన్న జెర్సీనే ధరించాడు.
టెస్టు సిరీస్ ముందు టీమిండియా బ్యాట్స్మన్కు చక్కటి సన్నాహకం లభించింది. చెతేశ్వర్ పుజారా (100; 187 బంతుల్లో 8x4, 1X6) సెంచరీ చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (68; 115 బంతుల్లో 8X1, 1X6) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. తొలి రోజు ఆట ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి భారత్ 297 పరుగులు చేసింది. హనుమ విహారీ (37; 101 బంతుల్లో 2X4), జడేజా (1) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్లలో కార్టర్ మూడు వికెట్లు.. హార్డింగ్, అకిం ఫ్రాజర్ తలో వికెట్ తీశారు.
బుధవారం జరిగిన చివరి వన్డేలో స్వల్పంగా గాయపడ్డ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సన్నాహక మ్యాచ్కు దూరమయ్యాడు. సారథ్య బాధ్యతలను అంజోక్య రహానే నిర్వర్తించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్, విండీస్ మధ్య ఈనెల 22న తొలి టెస్టు ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ను కూడా భారత్ చేజిక్కించుకుంటే.. ఒకే పర్యటనలో విండీస్ గడ్డపై మూడు ఫార్మాట్ల సిరీస్లను తొలిసారి గెలుచుకున్న రికార్డును కోహ్లీ సేన సృష్టిస్తుంది.