
హైదరాబాద్: వెస్టిండిస్తో అక్టోబర్ 21 నుంచి జరగనున్న వన్డే సిరిస్కు సెలక్టర్లు భారత జట్టుని ప్రకటించారు. ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మొదటి రెండు వన్డేలకు 14 మందితో కూడిన భారత జట్టుని ఎంపిక చేసింది.
టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు మొదటి రెండు వన్డేల్లో చోటు కల్పించారు. దీంతో వన్డేల్లో రిషబ్ పంత్ అరంగేట్రానికి సిద్ధమైంది. మరోవైపు, ఆసియా కప్లో దినేశ్ కార్తీక్ చక్కటి ప్రదర్శన కనబర్చినప్పటికీ, సెలక్టర్లు మాత్రం పంత్వైపే మొగ్గుచూపారు.
ఇక, వెస్టిండీస్తో టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి పొందిన భువనేశ్వర్, బుమ్రాలను మొదటి రెండు వన్డేలకు కూడా విశ్రాంతినిచ్చారు. వీరిస్థానంలో మహ్మద్ షమీకి సెలక్టర్లు చోటు కల్పించారు. రాజ్కోట్ వేదికగా విండిస్తో జరిగిన టెస్టులో విఫలమైన కేఎల్ రాహుల్కు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు తిరిగి జట్టులోకి వచ్చారు. మిడిలార్డర్లో అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మనీష్ పాండేలను ఎంపిక చేశారు. ఇక, బౌలర్లలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్, ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.
వెస్టిండిస్తో మొదటి రెండు వన్డేలకు భారత జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, మనీష్ పాండే, ధోనీ (వికె), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, షార్డుల్ ఠాకూర్, కేఎల్ రాహుల్