మూడో వన్డేకు చాహర్ దూరం:
'విశాఖ మ్యాచ్ సందర్భంగా వెన్నునొప్పిగా ఉందని చాహర్ తెలిపాడు. దీంతో అతడిని విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ వైద్య బృందం సూచించారు. దీంతో చాహర్ చివరి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. చాహర్ స్థానంలో యువ పేసర్ షైనీని జట్టులోకి ఎంపిక చేశాం' అని బీసీసీఐ తెలిపింది. ఇటీవల కాలంలో తన బౌలింగ్తో ఆకట్టుకుంటున్న చాహర్ లేకపోవడం భారత్కు గట్టి ఎదురుదెబ్బే.
రెండు రోజుల పాటు ప్రాక్టీస్:
మూడు వన్డే సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచిన భారత్-వెస్టిండీస్ జట్లు చివరిదైన మూడో మ్యాచ్ కోసం గురువారం భువనేశ్వర్కు చేరుకున్నాయి. ఆదివారం కటక్లోని బారాబతి స్టేడియంలో ఇరు జట్లు చివరి వన్డే ఆడనున్నాయి. శుక్రవారం శనివారం రెండు రోజుల పాటు ఆటగాళ్లు నెట్స్లో చెమటోడ్చనున్నారు. శుక్రవారం ఉదయం వెస్టిండీస్ జట్టు సాధన చేయనుండగా.. భారత్ మధ్యాహ్నం మైదానంలోకి దిగనుంది.
రాణించిన హిట్మ్యాన్, కుల్దీప్:
బుధవారం విశాఖలో విండీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదటగా హిట్మ్యాన్ రోహిత్ శర్మ (138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాటింగ్లో చెలరేగగా.. ఆపై కుల్దీప్ యాదవ్ (3/52), మొహమ్మద్ షమీ (3/39) ధాటికి విండీస్ 280 పరుగులకు ఆలౌటైంది. 107 పరుగులతో జయభేరి మోగించిన టీమిండియా 1-1తో సిరీస్ను సమం చేసింది.
మూడో వన్డే జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్, శివం దూబే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, నవదీప్ షైనీ.