కోహ్లీ కమాల్:
తొలి ఓవర్ నుండే రోహిత్, రాహుల్ చెలరేగారు. ఈ జోడి ధాటికి 4.1 ఓవర్లలోనే (25 బంతుల్లో) భారత్ 50 పరుగులు పూర్తి చేసింది. ఆ తర్వాత ఓపెనింగ్ జోడి ఫోర్లు, సిక్స్లు బాదడంతో పవర్ప్లేలో భారత్ 72/0 స్కోరు చేసింది. వరుస సిక్స్లు బాది 23 బంతుల్లోనే రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసాడు. మరోవైపు రాహుల్ కూడా ధ్యతాయుతంగా ఆడి 29 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్స్లు) ఫిఫ్టీ చేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా 116 పరుగులు చేసింది. రోహిత్, రిషభ్ పంత్ (0) ఔట్ కావడంతో మధ్యలో భారత్ జోరు కొంచెం తగ్గింది. అయితే కోహ్లీ రెచ్చిపోవడంతో మళ్లీ ఊపందుకుంది.
ఆదిలోనే షాక్:
241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లో కింగ్ (5)ను భువనేశ్వర్.. మూడో ఓవర్లో సిమన్స్ (7)ను షమీ.. నాలుగో ఓవర్లో పూరన్ (0)ను చాహర్ పెవిలియన్ చేర్చారు. దాంతో విండీస్ 17 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. అనంతరం హెట్మైర్ (24 బంతుల్లో 41; 1 ఫోర్, 5 సిక్స్లు) కాసేపు మెరిశాడు.
పొలార్డ్ అర్ధ సెంచరీ:
పదో ఓవర్లో కుల్దీప్ హెట్మైర్ను ఔట్ చేసాడు. ఆ తర్వాత పొలార్డ్ సిక్స్లతో విరుచుకుపడటంతో విండీస్ స్కోరు 10.4 ఓవర్లలోనే వంద పరుగులకు చేరింది. ఇక పొలార్డ్ 33 బంతుల్లో (3 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం భువీ బౌలింగ్లో పొలార్డ్ ఔట్ కావడంతో విండీస్ ఆశలు ఆవిరయ్యాయి.
వాంఖడే రికార్డులు:
బుధవారం వాంఖెడే మైదానంలో పరుగుల వరద పారించిన భారత బ్యాట్స్మన్ పలు రికార్డులను నమోదు చేయగా.. వెస్టిండీస్ జట్టు మాత్రం చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంది.
# స్వదేశంలో టీ20 ఫార్మాట్లో 1000 పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్గా విరాట్ రికార్డు సృష్టించాడు.
# టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మతో (2,633) సమంగా కోహ్లీ నిలిచాడు.
# అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు అందుకున్న రెండో క్రికెటర్గా కోహ్లీ (15) నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (19) అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా అవార్డుతో మూడో స్థానంలో ఉన్న జాక్వస్ కలిస్ (14)ను కోహ్లీ దాటేశాడు.
# అంతర్జాతీయ క్రికెట్లో 400 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (404) మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ (534), షాహిద్ అఫ్రీది (476) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
# ఒక టీ20 మ్యాచ్లో ముగ్గురు (రోహిత్ , రాహుల్, కోహ్లీ) ఆటగాళ్లు 70 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇదే తొలిసారి.
# టీ20 ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్లు ఇద్దరూ అర్ధశతకాలు బాదడం ఇది ఐదోసారి.
# టీ20ల్లో భారత్కు ఇదే మూడో అత్యుత్తమ స్కోరు. 2017లో శ్రీలంకపై చేసిన 260 పరుగులు అత్యధికం.
# అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్ చేతిలో వెస్టిండీస్ వరుసుగా ఏడు సిరీసులను కోల్పోయింది.
# తాజా ఓటమితో వెస్టిండీస్ చెత్త రికార్డు నమోదు చేసుకుంది. టీ20ల్లో అత్యధిక పరాజయాల్ని చవిచూసిన జట్టుగా శ్రీలంక (61)తో సమంగా నిలిచింది.