హోప్, లూయిస్ శుభారంభం:
ఈ వన్డేలో టాస్ ఓడిన విండీస్ మొదటగా బ్యాటింగ్ చేస్తోంది. ఇనింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు షాయ్ హోప్, ఎవిన్ లూయిస్ ఆచితూచి ఆడారు. భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రవీంద్ర జడేజా బౌలింగ్లో లూయిస్ మొదటి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. లూయిస్ 50 బంతుల్లో మూడు బౌండరీలతో 21 పరుగులు సాధించాడు.
ఆదుకున్న హెట్మయెర్:
అనంతరం నిలకడగా ఆడుతున్న హోప్.. 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పేసర్ మొహమ్మద్ షమీ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. హోప్ 50 బంతుల్లో ఐదు బౌండరీలు బాదాడు. షమీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన హోప్.. బౌల్డ్గా నిష్క్రమించాడు. ఈ సమయంలో రోస్టన్ చేజ్, హెట్మయెర్ జట్టును ఆదుకున్నారు. చేజ్ స్ట్రైక్ రొటేట్ చేయగా.. హెట్మయెర్ రెచ్చిపోయాడు.
వన్డేల్లోమొదటి వికెట్:
కుదురుకున్న విండీస్ ఇన్నింగ్స్ను అరంగేట్ర యువ పేసర్ నవ్దీప్ సైనీ కుదుపుకు లోనుచేశాడు. తన వరుస ఓవర్లలో రెండు వికెట్లను ఖాతాలో వేసుకుని వెస్టిండీస్కు షాక్ ఇచ్చాడు. 30వ ఓవర్ రెండో బంతికి హెట్మయెర్ (37) పెవిలియన్ చేరాడు. హెట్మయెర్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద కుల్దీప్ యాదవ్ అద్భుత క్యాచ్ పట్టాడు. వన్డేల్లో సైనీకి ఇదే మొదటి వికెట్. ఇక 32వ ఓవర్ మూడో బంతికి చేజ్ (38)ను ఔట్ చేసాడు.
పూరన్ హాఫ్ సెంచరీ:
నాలుగు వికెట్లు కోల్పోయినా నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్లు భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పోలార్డ్ సిక్సులతో చెలరేగుతున్నాడు. మరోవైపు పూరన్ 444 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసాడు. ప్రస్తుతం క్రీజులో పూరన్ (52), పోలార్డ్ (32) పరుగులతో ఉన్నారు. విండీస్ 43 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. జడేజా, షమీ తలో వికెట్ తీయగా.. సైనీ రెండు వికెట్లు సాధించాడు.