కటక్ వన్డే.. షాయ్ హోప్ అరుదైన రికార్డు!!

కటక్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో విండీస్ ఓపెనర్ షాయ్ హోప్ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో మూడు వేల పరుగులు సాధించాడు. హోప్ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా.. మూడు వేల వన్డే పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో వేగవంతంగా మూడు వేల వన్డే పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
హోప్ 67 ఇన్నింగ్స్లలో మూడు వేల వన్డే పరుగులు చేయడంతో .. పాకిస్తాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ను అధిగమించాడు. అజామ్ 68 ఇన్నింగ్స్ల్లో మూడు వేల పరుగుల్ని సాధిస్తే.. హోప్ ఒక ఇన్నింగ్స్ ముందుగానే ఆ మార్కును చేరుకున్నాడు. అయితే వన్డే ఫార్మాట్లో వేగవంతంగా మూడు వేల పరుగులు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్లు) అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇక వెస్టిండీస్ తరఫున వన్డేల్లో మూడు వేల పరుగులు సాధించిన 12వ ఆటగాడిగా హోప్ నిలిచాడు.

హోప్, లూయిస్ శుభారంభం:
ఈ వన్డేలో టాస్ ఓడిన విండీస్ మొదటగా బ్యాటింగ్ చేస్తోంది. ఇనింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు షాయ్ హోప్, ఎవిన్ లూయిస్ ఆచితూచి ఆడారు. భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రవీంద్ర జడేజా బౌలింగ్లో లూయిస్ మొదటి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. లూయిస్ 50 బంతుల్లో మూడు బౌండరీలతో 21 పరుగులు సాధించాడు.

ఆదుకున్న హెట్మయెర్:
అనంతరం నిలకడగా ఆడుతున్న హోప్.. 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పేసర్ మొహమ్మద్ షమీ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. హోప్ 50 బంతుల్లో ఐదు బౌండరీలు బాదాడు. షమీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన హోప్.. బౌల్డ్గా నిష్క్రమించాడు. ఈ సమయంలో రోస్టన్ చేజ్, హెట్మయెర్ జట్టును ఆదుకున్నారు. చేజ్ స్ట్రైక్ రొటేట్ చేయగా.. హెట్మయెర్ రెచ్చిపోయాడు.

వన్డేల్లోమొదటి వికెట్:
కుదురుకున్న విండీస్ ఇన్నింగ్స్ను అరంగేట్ర యువ పేసర్ నవ్దీప్ సైనీ కుదుపుకు లోనుచేశాడు. తన వరుస ఓవర్లలో రెండు వికెట్లను ఖాతాలో వేసుకుని వెస్టిండీస్కు షాక్ ఇచ్చాడు. 30వ ఓవర్ రెండో బంతికి హెట్మయెర్ (37) పెవిలియన్ చేరాడు. హెట్మయెర్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద కుల్దీప్ యాదవ్ అద్భుత క్యాచ్ పట్టాడు. వన్డేల్లో సైనీకి ఇదే మొదటి వికెట్. ఇక 32వ ఓవర్ మూడో బంతికి చేజ్ (38)ను ఔట్ చేసాడు.

పూరన్ హాఫ్ సెంచరీ:
నాలుగు వికెట్లు కోల్పోయినా నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్లు భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పోలార్డ్ సిక్సులతో చెలరేగుతున్నాడు. మరోవైపు పూరన్ 444 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసాడు. ప్రస్తుతం క్రీజులో పూరన్ (52), పోలార్డ్ (32) పరుగులతో ఉన్నారు. విండీస్ 43 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. జడేజా, షమీ తలో వికెట్ తీయగా.. సైనీ రెండు వికెట్లు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications