కటక్: బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న కీలక మూడో వన్డేలో విండీస్ ఓపెనర్లను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ షాయ్ హోప్ 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పేసర్ మొహమ్మద్ షమీ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. హోప్ 50 బంతుల్లో ఐదు బౌండరీలు సాధించాడు. హోప్ అర్ధ సెంచరీకి చేరువలో షమీకి చిక్కాడు.
నా ప్రేమ, బలం, గేమ్ చేంజర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు: రోహిత్
అంతకుముందు రవీంద్ర జడేజా బౌలింగ్లో ఓపెనర్ ఎవిన్ లూయిస్ పెవిలియన్ చేరాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర నవ్దీప్ సైనీ చేతికి లూయీస్ చిక్కాడు. లూయిస్ 50 బంతుల్లో మూడు బౌండరీలు సాధించాడు. హోప్ అనంతరం క్రీజులోకి వచ్చిన హెట్మయెర్ ధాటిగా ఆడుతున్నాడు. ఇప్పటికే ఓ సిక్స్ బాది భారత బౌలర్లకు హెచ్చరికలు జారీ చేసాడు. మరోవైపు రోస్టన్ చేజ్ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. అతడు స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం క్రీజులో చేజ్ (27), హెట్మయెర్ (24) పరుగులతో ఉన్నారు. విండీస్ 27 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. జడేజా, షమీ తలో వికెట్ తీశారు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్తో సైనీ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వెన్ను గాయంతో దీపక్ చాహర్ ఈ మ్యాచ్కు దూరం అయిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో ఇరు జట్లు చెరొకటి నెగ్గి సమ ఉజ్జీగా నిలిచాయి. దీంతో కటక్ వన్డే పోరు ఇరు జట్లకు కీలకం. గెలిచిన జట్టుదే సిరీస్ కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బలాబలాలపరంగా భారత్దే పైచేయి అయినా.. ఈ పర్యటనలో విండీస్ ఆటను చూస్తే తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పదో ద్వైపాక్షిక సిరీస్ సాధించాలనే లక్ష్యంతో కోహ్లీసేన ఉంటే.. మరోవైపు 13 ఏళ్లుగా ఊరిస్తున్న సిరీస్ విజయాన్ని ఈసారైనా ఒడిసిపట్టుకోవాలని విండీస్ పట్టుదలతో ఉంది.