తిరువనంతపురం: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను విండీస్ 1-1తో సమం చేసింది. టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి మరో 9 బంతులు మిగిలి ఉండగానే విండీస్ ఛేధించింది. లక్ష్య ఛేదనలో విండీస్ బ్యాట్స్మెన్ ఎలాంటి తడబాటు లేకుండా సునాయాస విజయాన్ని అందుకున్నారు.
లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ సిమ్మన్స్ (67 నాటౌట్; 45 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ (40; 35 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. వీరికి తోడు హెట్మైర్ (23;14 బంతుల్లో 3 సిక్సర్లు), నికోలస్ పూరన్ (38 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో విండీస్ సునాయాస విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా విండీస్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఒకవైపు విండీస్ బ్యాట్స్మెన్ జోరుకు తోడు భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్ టీమిండియా పరాజయానికి కారణం అయింది . భారత బౌలర్లలో సుందర్, జడేజాలు తలో వికెట్ తీశారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లో యువ ఆల్రౌండర్ శివమ్ దూబే ( 54; 30 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి అర్ధసెంచరీ సాధించాడు. చివర్లో రిషభ్ పంత్ (33నాటౌట్; 22 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్) ఓ మోస్తారుగా రాణించాడు. వీరిద్దరూ మినహా ప్రధాన బ్యాట్స్మన్ ఎవరూ రాణించలేదు. దూబే, పంత్ భారత్కు గౌరవ ప్రదమైన స్కోరును సాధించిపెట్టగా.. మిగితా బాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు.
ఓపెనర్ కేఎల్ రాహుల్ (11) పరుగులకే వెనుదిరగగా.. అనంతరం రోహిత్ శర్మ (15)కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అయితే ఈ అనూహ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన దూబే జట్టు బాధ్యతను తీసుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదతూ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. ఇదే జోరులో హాఫ్ సెంచరీ సాధించాడు. భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. శివమ్ ఔట్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (19), శ్రేయాస్ అయ్యర్ (10), రవీంద్ర జడేజా (9) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ క్రమంలో పంత్ ఓ మోస్తారు ఇన్నింగ్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
కరీబియన్ బౌలర్లు కాట్రెల్, విలియమ్స్ స్లో షార్ట్ బాల్స్తో పరుగులను భారీగా కట్టడి చేశారు. విండీస్ బౌలర్లలో విలియమ్స్, వాల్స్ రెండు.. కాట్రెల్, హోల్డర్, పియర్లు తలో వికెట్ పడగొట్టారు. కీలకమైన మూడో టీ 20 ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ నెల 11న జరుగునుంది. చివరి మ్యాచ్ గెలిచిన వారు సిరీస్ కైవసం చేసుకుంటారు.