మ్యాచ్కు వర్షం ముప్పులేదు:
తొలి టీ20 మ్యాచ్కు వరుణుడు అడ్డుపడే అవకాశం ఉందని రెండు రోజుల క్రితం హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక ద్వారా సమాచారం తెలిసింది. శుక్రవారం ఉదయం 6 నుంచి 11 గంటల మధ్యలో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ప్రస్తుతం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఉదయం నుండే ఎండ కాస్తోంది. వాతావరణం మ్యాచ్కు అనుకూలంగా ఉండనుంది. వర్షం ముప్పులేదని సమాచారం తెలుస్తోంది. అభిమానులు ఎలాంటి సందేహం లేకుండా మ్యాచ్ను వీక్షించొచ్చు.
భారీ స్కోర్లు:
ఉప్పల్ పిచ్ బౌలర్లకు బాగా కలిసొచ్చింది. ఐపీఎల్లో సన్రైజర్స్ బౌలర్లు తమ బ్యాట్స్మెన్ తక్కువ స్కోరు చేసినా.. మ్యాచ్ను నిలబెట్టిన సందర్భాలున్నాయి. మంచు ప్రభావం దృష్ట్యా పిచ్ను పూర్తిగా కప్పి ఉంచారు. 2018 జనవరి నుంచి ఈ వికెట్పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 162 పరుగులు. ఈ రోజు కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఇదే తొలి టీ20 మ్యాచ్:
ఉప్పల్లో 2017 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ వర్షంతో రద్దయింది. అంతకు ముందునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టాస్ వేయాల్సిన అవసరం కూడా లేకుండానే ఆ మ్యాచ్ రద్దయింది. దీంతో ఈ మైదానంలో ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగలేదు. ఈ రోజు జరిగేదే తొలి టీ20 మ్యాచ్. ఉప్పల్ స్టేడియం ఇప్పటి వరకు 6 వన్డేలు, 5 టెస్టులకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే పెద్ద సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి.
8 మ్యాచ్ల్లో విజయం:
భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్లు జరిగాయి. భారత్ 8 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. విండీస్ 5 మ్యాచ్ల్లో గెలుపొందింది. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. విండీస్తో జరిగిన చివరి 5 టీ20ల్లో టీమిండియానే విజయం సాయించింది.