గేల్ తడబాటు:
ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో టాస్ ఆలస్యం అయింది. దీంతో ముందుగా మ్యాచ్ను 43 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్కు సహకరిస్తున్న పిచ్పై భారత పేసర్లు సత్తా చాటడంతో.. విండీస్ ఓపెనర్లు పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా క్రిస్ గేల్ భారత బౌలర్లను ఎదుర్కొలేక తడబడ్డాడు. దీంతో తొలి 5 ఓవర్లకు విండీస్ వికెటేమీ కోల్పోకుండా 8 పరుగులే చేసింది. 5.4 ఓవర్లలో విండీస్ 9/0తో ఉన్న దశలో మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది.
లూయిస్ దాడి:
దాదాపు గంటసేపు మ్యాచ్ ఆగిపోయింది. దీంతో మ్యాచ్ను 34 ఓవర్లకు కుదించారు. క్రీజులోకి వచ్చిన లూయిస్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భువనేశ్వర్ ఓవర్లో సిక్సర్ బాదిన లూయిస్.. ఖలీల్ తొలి ఓవర్లో వరుసగా 4,6,4 బౌండరీలు సాధించాడు. అతడి దాటికి విండీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు గేల్ నెమ్మదిగా ఆడాడు. ఖలీల్ ఓవర్లో లూయిస్ మరో సిక్స్ బాదడంతో.. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది.
మరోసారి వర్షం ఆటంకం:
గేల్ (4; 34బంతుల్లో) తడబడుతూ చివరకు కుల్దీప్ వేసిన 11వ ఓవర్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన షై హోప్ (6*; 11బంతుల్లో)తో కలిసి లూయిస్ (40*; 36బంతుల్లో 2×4, 3×6) ఇన్నింగ్స్ను గాడిలో పెడుతుండగా.. మరోసారి వర్షం పలకరించింది. అప్పటికీ విండీస్ 13 ఓవర్లకు వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. వరుణుడు వస్తూ పోతూ చాలాసేపు అంతరాయం కలిగించాడు. మధ్యలో ఓసారి వర్షం తగ్గి ఆట ఆరంభమయ్యే సూచనలు కనిపించినా.. తిరిగి వర్షం జోరందుకోవడంతో ఆట సాగలేదు. ఇక సమయం వృథా కావడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ పదవి నుండి తప్పుకున్న మైక్ హెస్సన్
కోహ్లీ స్టెప్పులు:
ఓ వైపు మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగిస్తుంటే.. మైదానంలోని ఆటగాళ్లు మాత్రం ఎంజాయ్ చేశారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చిందులు వేశాడు. విరామం అనంతరం మైదానంలోకి వచ్చిన కోహ్లీ డీజే పాటలకు డ్యాన్స్ చేస్తుంటే.. క్రిస్ గేల్ కూడా తనదైన శైలిలో కోహ్లీకి సహకరించాడు. ఇద్దరు కలిసి స్టెప్పులు వేయడంతో మైదానంలోని అభిమానులు కూడా స్టెప్పులు వేస్తూ ఆనందించారు.