పరువు కోసం శ్రీలంక
మరోవైపు శ్రీలంక కూడా చివరి టెస్టుని గెలిచి పరువు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ఇందులో భాగంగా మూడో టెస్టు కోసం తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకుంటున్న వైస్ కెప్టెన్ లాహిరు తిరుమన్నెపై లంక మేనేజ్మెంట్ వేటువేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమన్నె స్థానంలో ధనంజయ డిసిల్వాను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మూడో టెస్టు జట్టు ఎంపికలో కెప్టెన్ కోహ్లీకి తలనొప్పి వచ్చి పడింది.
ఓపెనింగ్పై కోహ్లీ డైలమా
ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేశారు. వీరిద్దరూ తొలి ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేక పోయారు. కానీ రెండో ఇన్నింగ్స్లో రాహుల్ 79 పరుగులు చేయగా, ధావన్ 94 రన్స్ వద్ద ఔటై తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఇక నాగ్ పూర్లో జరిగిన రెండో టెస్టుకు సోదరి వివాహం కారణంగా ధావన్ దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో ఓపెనర్గా వచ్చిన మురళీ విజయ్ 128 పరుగులతో సెంచరీ చేసిన తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక, సోదరి వివాహం అనంతరం శిఖర్ ధావన్ మూడో టెస్టుకి అందుబాటులోకి వచ్చాడు.
దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం
దీంతో రాహుల్, ధావన్, విజయ్లలో ఓపెనర్లుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయం కోహ్లీకి తలనొప్పిగా మారింది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ మూడో టెస్టులో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటలకు కోహ్లీసేన వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా కోహ్లి ఎవరికీ ప్రాధాన్యం ఇస్తాడనే విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డుకి చేరువలో కోహ్లీసేన
మరోవైపు మూడో టెస్టులో కోహ్లీసేన విజయం సాధిస్తే అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంటుంది. ఈ విజయంతో టీమిండియా వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్ సొంతం చేసుకున్నట్టు అవుతోంది. ఇప్పటి వరకు టెస్టుల్లో ఆస్ట్రేలియా మాత్రమే వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీసేన సమం చేస్తుంది. 2005-2008 మధ్య ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్ల్లో విజయం సాధించింది.
10 సిరీస్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్
లంకతో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ అనంతరం భారత్.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జరిగే టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంటే వరుసగా 10 సిరీస్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలుస్తోంది. మరోవైపు ఢిల్లీ టెస్టులో కెప్టెన్ కోహ్లీ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. టెస్టుల్లో కోహ్లీ 5వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ టెస్టులో ఆ పరుగులు పూర్తి చేస్తే భారత్ తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్లో చేరిన 11వ ఆటగాడిగా గుర్తింపు పొందుతాడు.
పిచ్ రిపోర్ట్:
రెండో టెస్టు మ్యాచ్ జరిగిన నాగ్ పూర్ పిచ్ మాదిరే ఫిరోజ్ షా కోట్ల పిచ్ను కూడా పేస్కు అనుకూలంగా తీర్చిదిద్దారు. బ్యాట్స్ మెన్ల కంటే బౌలర్లుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
జట్ల వివరాలు:
భారత జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, మురళీ విజయ్, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, పుజారా, అజింక్య రహానే, శంకర్, కుల్దీప్ యాదవ్.
శ్రీలంక:
దినేష్ చండిమాల్ (కెప్టెన్), డిముత్ కరుణరత్నే, సడేరా సమరావిక్రమ, లాహిరు తిరమన్నే, నిరోషాన్ డిక్వెల్లా, ఏంజెలో మాథ్యూస్, దిల్రువాన్ పెరెరా, జెఫెరీ వెండర్సే, రోషన్ సిల్వా, దషన్ షనాక, సురంగ లక్మల్, లాహిరు గమాగె, లక్ష్మణ సందకన్, ధనంజయ డి సిల్వా.
టీవీలో ప్రత్యక్ష ప్రసారం:
స్టార్ స్పోర్ట్స్ 1, 3
ఇంటర్నెట్లో ప్రత్యక్ష ప్రసారం: హాట్ స్టార్