విశాఖలో తొలి టెస్టు: భారత్-దక్షిణాఫ్రికా హెడ్ టు హెడ్ రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే!

హైదరాబాద్: నాలుగేళ్ల విరామం తర్వాత టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా తొలి టెస్టు విశాఖపట్నం వేదికగా బుధవారం ప్రారంభం కానుంది. గతంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు సిరిస్ ప్రారంభమవుతుంటే భారత్ బ్యాటింగ్, సఫారీ బౌలింగ్పై ఎక్కువ దృష్టి సారించేవారు.
ముఖ్యంగా దక్షిణాఫ్రికా పేస్ ఎటాక్ను టీమిండియా బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారనే ఊహాగానాలు వచ్చేవి. అయితే, ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా టీమిండియా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో సైతం అల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొడుతోంది. ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో టీమిండియానే ఫేవరేట్గా కనిపిస్తోంది.
ప్రస్తుంత దక్షిణాఫ్రికా జట్టులో హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్ లాంటి మేటి ఆటగాళ్లు లేకపోవడమే ఇందుకు కారణం. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాత జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇప్పటివరకు మొత్తంగా దక్షిణాఫ్రికా ఆరు సార్లు భారత్లో పర్యటించింది.
1999-2000 పర్యటనలో భాగంగా 2-0తో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన ఐదు సిరీస్ల్లో టీమిండియాపై విజయం సాధించలేకపోయింది. 2007-08, 2009-10 పర్యటనల్లో సిరీస్ 'డ్రా'గా ముగియగా... మిగిలిన మూడు సిరీస్ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. చివరగా 2015లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా సిరిస్ను 3-0తో చేజార్చుకుంది.
భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు నేపథ్యంలో గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే...

హెడ్ టు హెడ్ రికార్డు
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 36 టెస్టు మ్యాచ్లు జరగ్గా దక్షిణాఫ్రికా జట్టు 15 విజయాలు సాధించగా... టీమిండియా 11 విజయాలు సాధించింది. 10 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.

అత్యధిక వ్యక్తిగత స్కోరు
వీరేంద్ర సెహ్వాగ్: భారత్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(319) నిలిచాడు. 2007-08 పర్యటనలో చెన్నై వేదికగా సఫారీలతో జరిగిన టెస్టులో సెహ్వాగ్ ఈ స్కోరు సాధించాడు. ఇక, ప్రస్తుతం ఉన్న జట్టులో విరాట్ కోహ్లీ(153 - 2018లో సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్లో), ఛటేశ్వర్ పుజారా(153- 2013లో జెహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో) అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు.
హషీం ఆమ్లా: 2010లో నాగ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో హషీం ఆమ్లా(253) పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

అత్యధిక పరుగులు
సచిన్ టెండూల్కర్: దక్షిణాఫ్రికాపై మొత్తం 25 టెస్టులు ఆడిన సచిన్ 42.26 యావరేజితో 1741 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న భారత జట్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 9 మ్యాచ్ల్లో 47.37 యావరేజితో 758 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
జాక్వస్ కల్లిస్: భారత్పై మొత్తం 18 టెస్టులు ఆడిన కల్లిస్ 69.36 యావరేజితో 1734 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్, కల్లిస్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 7 సెంచరీలు సాధించారు.

అత్యధిక వికెట్లు
అనిల్ కుంబ్లే: సఫారీలతో మొత్తం 21 మ్యాచ్లు ఆడిన అనిల్ కుంబ్లే 84 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే బెస్ట్ 6/53. ప్రస్తుతం ఉన్న జట్టులో అశ్విన్ 7 టెస్టులు ఆడి 38 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ బెస్ట్ 7/66గా ఉంది.
డేల్ స్టెయిన్: రెండు నెలలు క్రితం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన డేల్ స్టెయిన్ భారత్పై మొత్తం 14 టెస్టులు ఆడి 65 వికెట్లు పడగొట్టాడు. డెల్ స్టెయిన్ బెస్ట్ 7/51.

బెస్ట్ బౌలింగ్
లాన్స్ క్లూసెనర్: 1999-2000 పర్యటనలో భాగంగా లాన్స్ క్లూసెనర్ 8 వికెట్లు తీసి 64 పరుగులు సమర్పించుకున్నాడు.
అశ్విన్: నాగ్ పూర్ వేదికగా 2015లో జరిగిన టెస్టులో అశ్విన్ 7 వికెట్లు తీసి 66 పరుగులు సమర్పించుకున్నాడు.

అత్యధిక భాగస్వామ్యం
ఇండియా: 2013లో జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, పుజారాలు కలిసి 311 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
దక్షిణాఫ్రికా: 2010లో నాగ్పూర్ వేదికగా జరిగిన టెస్టులో హషీం ఆమ్లా, జాక్వస్ కల్లిస్ కలిసి 340 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇరు జట్లలో ఏ వికెట్కైనా ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications