
హైదరాబాద్: విశాఖ వేదికగా బుధవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు చోటు దక్కని సంగతి తెలిసిందే. తొలి టెస్టుకు రిషబ్ పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాను తీసుకున్నట్లు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
రిషబ్ పంత్ తుది జట్టులో చోటు కోల్పోవడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "రిషబ్ పంత్ స్థానంలో సాహాని తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ సిరిస్ మొత్తం సాహానే వికెట్ కీపర్గా కొనసాగించాలి. అప్పుడే పంత్ తన తప్పులను గ్రహిస్తాడు. ఈ నిర్ణయం అతనికి మంచి విరామాన్నిస్తుంది" అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.
"నువ్వు ఎంత మంచివాడివనేది కాదు ఇక్కడ ముఖ్యం. పంత్కు ఇదొక మంచి పాఠం. అతడు తన తప్పులను తెలుసుకుని త్వరలోనే పునరాగమం చేస్తాడు" అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. రిషబ్ పంత్ను తొలి టెస్టు నుంచి తప్పించడంపై కోహ్లీ మాట్లాడుతూ పంత్కు తగిన అవకాశాలు ఇవ్వాలని భావించామని, అయితే ఉన్నపళంగా రాణించాలని అతడిపై ఒత్తిడి తీసుకురాలేదని తెలిపాడు.
పంత్కు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని, విదేశాల్లో అతడి ప్రతిభ కారణంగా మరిన్ని అవకాశాలిస్తామని కోహ్లీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. సాహా గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడని, అతడో అత్యుత్తమ కీపర్ అని విరాట్ కోహ్లీ కొనియాడాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా గతంలో అతడు జట్టుకు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని అవకాశమిచ్చినట్లు కోహ్లీ తెలిపాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోనీకి వారసుడిగా పంత్ ఆరంగేట్రం చేసాడు. మొదటిలో బాగానే ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో రెండు సెంచరీలు కూడా చేసాడు. ధోనీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పంత్కు ప్రపంచకప్లో కూడా అవకాశం ఇచ్చారు. అక్కడ రాణించలేదు. ఇక ఇటీవలి కాలంలో అతనికి పదే పదే జట్టులో స్థానం ఇస్తున్నారు. అయినా పంత్ పరుగులు చేయలేకయాడు.
వెస్టిండీస్ సిరీస్లో తనకు అలవాటైన చెత్త షాట్లకు ఔట్ అయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చే పంత్ ఇన్నింగ్స్ను నిర్మించలేకపోతున్నాడు. సమయం సందర్భం చూడకుండా.. భారీ షాట్ ఆడుతూ పెవిలియన్ చేరుకుంటున్నాడు. పంత్ తన చివరి ఆరు ఇన్నింగ్స్లలో కేవలం 77 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఐదు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి.
తొలి టెస్టుకు టీమిండియా:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ