బ్యాడ్ లైట్.. మ్యాచ్ నిలిపివేత:
తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. భారత పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా జట్టు సింగల్ డిజిట్కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. పేసర్ మొహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే డీన్ ఎల్గార్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డికాక్ (4).. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇద్దరు కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చారు. అనంతరం మరో మూడు ఓవర్ల పాటు డుప్లెసిస్, హంజాలు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ సమయంలో బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. క్రీజులో హంజా (0), డుప్లెసిస్ (1) ఉన్నారు.
రహానే సెంచరీ:
అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 497/9 వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ స్కోర్ 224/3తో ఆదివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ పరుగుల వరద పారించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (212; 255 బంతుల్లో 28x4, 6x6) డబుల్ సెంచరీ చేయగా.. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (115; 192 బంతుల్లో 17x4, 1x6) సెంచరీ చేసాడు. రోహిత్-రహానే జోడి ప్రొటీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ నాలుగో వికెట్కు 267 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే రహానే సెంచరీ.. రోహిత్ 150 పరుగులు చేసాడు.
రోహిత్ డబుల్ సెంచరీ:
రోహిత్-రహానే జోడి వేగంగా పరుగులు చేయడంతో భారత జట్టు స్కోర్ 300 పరుగులు దాటింది. ఆ తర్వాత లిండే బౌలింగ్లో రహానే ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా హిట్మ్యాన్కు అండగా నిలిచాడు. దీంతో లంచ్ విరామానికి భారత్ 357/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. లంచ్ అనంతరం రోహిత్ డబుల్ సెంచరీ చేసాడు. ఆపై భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు.
జడేజా మాయ:
ఈ సమయంలో జడేజా, సాహా జట్టుకు విలువైన పరుగులు జత చేశారు. వేగంగా ఆడుతూ జడేజా (51; 119 బంతుల్లో 4x4) అర్ధ సెంచరీ చేసాడు. జడేజా, సాహా (24) ఔట్ అయినా.. చివర్లో ఉమేశ్ యాదవ్ (31; 10 బంతుల్లో 5x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 10 బంతుల్లో ఓవరాల్గా ఐదు సిక్సర్లు కొట్టిన ఉమేశ్.. తొమ్మిదో వికెట్గా ఔటయ్యాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 497/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. షమీ (10 నాటౌట్), నదీమ్ (1 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే నాలుగు, రబాడ మూడు వికెట్లు తీశారు.